
సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టారంటూ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన గౌస్పాషా (39) ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగుట్టలో నివాసముంటున్నాడు. కూకట్పల్లిలోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న పోలీసులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టారని చెప్పాడు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కాల్ చేసిన వ్యక్తికి ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని వచ్చింది. వెంటనే ఆల్ఫా హోటల్ నుంచి జనాన్ని బయటకు పంపించి హోటల్ అంతా తనిఖీ చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు 100కు డయల్ చేసిన సమయంలో కాల్ ఖమ్మం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఖమ్మం వెళ్లి గౌస్పాషాను అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు తరలించారు.