
అమరావతి: ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టయ్యింది. అడవివరం శోఠ్యాం రోడ్డుమార్గాన ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ జంటలను ఆపి మీపై కేసులు పెడతాం అంటూ బెదిరించి గూగుల్ పే / ఫోన్ పే ద్వారా డబ్బులు దోచుకుంటున్నారు.
ఇటీవల పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ పురంకి చెందిన ఒక ప్రేమ జంటను బెదిరించి రూ.5 వేలు ఫోన్ పే చేయించుకున్నారు నకిలీ పోలీసులు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం (జూన్ 13) ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేసిన శివప్రసాద్గా గుర్తించారు. శివప్రసాద్ను అనుచిత ప్రవర్తనతో 2019లో విధుల నుంచి తొలగించారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహా నేరాలపై తొమ్మిది కేసులు నమోదయ్యానని పెందుర్తి సీఐ సతీష్ కుమార్ వెల్లడించారు.