
- విత్తనాలు, ఎరువులు.. ఇలా అన్నింటిపై ప్రత్యేక వీడియోలు..
- ఆకర్షించే ప్రకటనలు.. ఆకట్టుకునే మాటలు..
- మాయమాటల వలలో చిక్కుకుంటున్న అమాయకమైన రైతులు
- కంపెనీ, యూ ట్యూబర్లకు లాభాలు.. రైతులకు మాత్రం నష్టాలు..
- అధికారుల సలహాతోనే మందుకెళ్లాలని డీఏవో సూచన
భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్, వెలుగు : విత్తన కంపెనీలు ఇస్తున్న డబ్బులు తీసుకొని కొంతమంది యూ ట్యూబర్లు ఆకర్షించే ప్రకటనలు.. ఆకట్టుకునే మాటలతో సోషల్ మీడియాలో ‘ఫేక్’ ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు నమ్మి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెరిగింది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ...
జిల్లాలోని సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సోషల్ మీడియా ప్రచారంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తూ రైతులు నష్టపోతున్నారు. గతంలో పాల్వంచ, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడుతో పాటు పలు మండలాల్లో యూ ట్యూబర్ల ప్రచార మాయలో పడి కొనుగోలు చేసి వేసిన విత్తనాలు దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చేసిన దాఖలాలున్నాయి.
పక్కా ప్లాన్ తో...
సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేయగల కొందరు వ్యక్తులతో సీడ్ కంపెనీలు పక్కా ప్లాన్తో కొంత డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నాయి. సీడ్స్ క్వాలిటీతో సంబంధం లేకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా కొందరు యూట్యూబ్ లో ప్రత్యేక వీడియోలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ కంపెనీ ఎక్కువ డబ్బులు చెల్లిస్తే ఆ కంపెనీ గురించి రైతులను ఆకర్షించే విధంగా వీడియోలు చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. వీరి వలలో పడిన రైతులు విత్తనాల షాపులకు వెళ్లి అవే కంపెనీ విత్తనాలే కావాలని అడిగేలా ప్రభావితం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన విత్తనాలు, ఎరువులు ఆ విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ వసూలు చేస్తున్నారు.
అధికారుల సలహా తీసుకోవాలి..
ఇవే నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడినిస్తాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖాధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. - బాబూరావు, డీఏవో, భద్రాద్రికొత్తగూడెం