![మామా అల్లుళ్ల మధ్య గొడవ.. గన్తో బెదిరించిన మామ](https://static.v6velugu.com/uploads/2024/04/30_vn4zxAST7m.jpg)
- కింద పడడంతో చూసి బెదిరిపోయిన స్థానికులు
- ములుగు పెట్రోల్బంకు వద్ద ఘటన
- లైటర్ గన్ అని క్లారిటీ ఇచ్చిన పోలీసులు..కేసు నమోదు
ములుగు, వెలుగు : ములుగులోని ఓ పెట్రోల్ బంకులో మామ, అల్లుళ్లు గొడవ పడగా అల్లుడిని బెదిరించేందుకు మామ గన్ తీయడం కలకలానికి దారి తీసింది. పెనుగులాటలో అది దూరంగా పడిపోవడంతో బంకులో ఉన్న కస్టమర్లు, రోడ్డున పోయేవారు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఇద్దరినీ స్టేషన్కు తరలించారు. చివరకు మామ దగ్గరున్నది లైటర్ గన్అని తేల్చారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ములుగుకు చెందిన పోరిక మోహన్లాల్ ప్రభుత్వ టీచర్. ఈయన కూతురికి 2016లో ములుగు మండలం బండారుపల్లికి చెందిన బానోతు శరత్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో పెండ్లయ్యింది. వీరికి ఆరేండ్ల బాబు ఉన్నాడు. దంపతులిద్దరి మధ్య గొడవలతో మూడేండ్లుగా శరత్, ఇతడి భార్య కలిసి ఉండడం లేదు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. సమస్యను పరిష్కరించుకునేందుకు కోర్టును కూడా ఆశ్రయించారు.
సోమవారం మధ్యాహ్నం ములుగులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద శరత్ కనిపించడంతో ఇతడి మామ మోహన్లాల్ దగ్గరకు వెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య లొల్లి ముదరడంతో మోహన్లాల్ శరత్ ను బెదిరించేందుకు గన్ తీశాడు. శరత్ అడ్డుకోబోగా పెనుగులాట జరిగి గన్ దూరంగా పడిపోయింది. దీంతో పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన వారు, రోడ్డుపై నిలబడి ఈ గొడవ చూస్తున్న వారు భయపడ్డారు. కొంతమంది ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేయగా శరత్ 100కు డయల్ చేసి విషయం చెప్పాడు. ములుగు సీఐ రంజిత్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్ బంకు వద్దకు వచ్చి గన్ స్వాధీనం చేసుకొని ఇద్దరినీ పోలీస్స్టేషన్కు తరలించారు. గన్ ను పరిశీలించి అది లైటర్ గన్ గా తేల్చారు. అల్లుడిని బెదిరించడానికే మామ ఈ పని చేశాడని తెలుసుకున్నారు. శరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు.