- కోచ్గా కొత్త ఇన్నింగ్స్ షురూ చేస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఇండియా సీనియర్ షట్లర్, వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ బి. సాయి ప్రణీత్ సోమవారం బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచి, టోక్యో ఒలింపిక్స్లో పోటీ పడ్డ 31 ఏండ్ల ప్రణీత్ కొంతకాలంగా గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలికి, కోచ్గా మారాలని నిర్ణయించుకున్నాడు. 2019 వరల్డ్ చాంపియన్షిప్స్లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన ప్రణీత్ ఈ మెగా టోర్నీ మెన్స్ సింగిల్స్లో 36 ఏండ్ల తర్వాత పతకం గెలిచిన ఇండియన్గా రికార్డు సృష్టించాడు.
కెరీర్లో అత్యుత్తమంగా పదో ర్యాంక్ సాధించాడు. కానీ, తన తోటి షట్లర్లు సైనా, శ్రీకాంత్ స్థాయిలో ముందుకెళ్లలేకపోయాడు. అయితే, తన కెరీర్లో సాధించిన సక్సెస్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని ప్రణీత్ తెలిపాడు. ఎన్నో భావోద్వేగాలతో 24 ఏండ్లుగా తన ప్రాణంలా ఉన్న ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయి.. కోచ్లు, ఫ్యామిలీ, బ్యాడ్మింటన్ అసోసియేషన్, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే నెలలో యూఎస్ఏలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీకి హెడ్ కోచ్గా చేరబోతున్నానని
ప్రకటించాడు.