
- వానాకాలంలో 70 శాతానికి పైగా సాగు
- సర్కారు రూ.500 బోనస్తో ఈ ఏడాది పెరగనున్న విస్తీర్ణం
- కిందటి సీజన్లో క్వింటాలు
- రూ.3వేలకు కొన్న మిల్లర్లు, ట్రేడర్లు
- దొడ్డు రకాల కన్నా కాస్త దిగుబడి తగ్గినా లాభదాయకమే
మంచిర్యాల, వెలుగు: ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్న రకం వడ్ల సాగుకే రైతులు సై అంటున్నారు. సాధారణంగా ప్రతి వానాకాలం రాష్ర్టంలో 70 శాతానికి పైగా సన్న వడ్లు పండిస్తుంటారు. ఈసారి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లోనూ సన్న బియ్యానికి విపరీతంగా డిమాండ్ ఉంది.
దీంతో ప్రైవేట్లోనూ మిల్లర్లు, ట్రేడర్లు సన్నవడ్లను మద్దతు ధరకు మించి కొంటున్నారు. కిందటి సీజన్లో క్వింటాలుకు రూ.2,800 నుంచి రూ.3,200 వరకు చెల్లించారు. దొడ్డు రకాల కన్నా కాస్త తక్కువ దిగుబడి వస్తున్నా రేటు పరంగా చూస్తే సన్నాలు సాగే లాభదాయకం అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి 55 లక్షల ఎకరాల్లో....
సన్న రకం వడ్ల సాగుకు వానాకాలం సీజన్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో ఏటా ఈ సీజన్లో రైతులు సన్నవడ్లు ఎక్కువగా పండిస్తుంటారు. ఈసారి రాష్ర్టవ్యాప్తంగా 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 55 లక్షల ఎకరాల్లో అంటే 80 శాతానికి పైగా సన్నాలు వేసే చాన్స్ ఉందంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా1.30 లక్షల ఎకరాల్లో (80 శాతం) సన్న వడ్లు పండిస్తారని వ్యవసాయ శాఖ పేర్కొంది. గత సీజన్లో ఇరిగేషన్ సౌకర్యం ఉన్న ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్జిల్లాల్లో 80 శాతం సన్నాలు సాగు చేశారు. ఈసారి ఆయా జిల్లాల్లో 90 శాతం వరకు సాగవుతుందని
చెబుతున్నారు.
దిగుబడి తగ్గినా లాభమే....
దొడ్డు రకాలు ఎకరానికి 28 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తే...సన్నాలు 22 నుంచి 25 క్వింటాళ్లు వస్తాయి. నిరుడు మద్దతు ధర క్వింటాలుకు కామన్ గ్రేడ్రూ.2,183, ఏ గ్రేడ్ రూ.2,203గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారులు సన్నవడ్లకు రూ.3 వేల పైనే చెల్లించారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందే రైతులకు అడ్వాన్సులిచ్చి మరీ కొన్నారు.
మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడంతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం వంటి శ్రమ రైతులకు తప్పింది. ఈ ఏడాది ఎమ్మెస్పీ (మినిమమ్సపోర్ట్ ప్రైస్)ను కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. ఓపెన్ మార్కెట్లో నిరుటితో పోలిస్తే ధరలు తగ్గినా ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్తో కలిపి రైతులకు క్వింటాలుకు రూ.2,700కు పైనే గిట్టుబాటయ్యే చాన్స్ఉంది.
సూపర్ ఫైన్ రకాలివే..
తెలంగాణలో ఎక్కువగా ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, వర్ష, కావేరి, హెచ్ఎంటీ, చింటు, జై శ్రీరామ్, బీపీటీ వంటి సన్న రకాలు సాగు చేస్తున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో సాయిరామ్, సాయిరామ్ గోల్డ్, దఫరి 1008, అక్షయ, అక్షయ గోల్డ్, సిరి, సమృద్ధి, జీకే సావిత్రి, దివ్యజ్యోతి, అంకుర్101, డబ్ల్యూజీఎల్14 రకాలు కూడా వేస్తున్నారు. సన్నవడ్లకు సుడిదోమ, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు ఎక్కువగా సోకుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్ల సమస్యను అధిగమించొచ్చు. ఈసారి సన్నాలు సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సీడ్ సప్లై చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రైవేట్లో రేటు లేకున్నా బోనస్ వస్తది..
వానాకాలం సీజన్లో 15 ఎకరాల్లో సన్నాలు వేసిన. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలు రూ.3,150తో కొన్నరు. నిరుడు మార్కెట్లో సన్నవడ్లకు మంచి రేట్లు ఉండె. కానీ ఏటా ఇట్లనే ఉంటదన్న గ్యారెంటీ లేదు. వ్యాపారులు రేట్లు పెంచవచ్చు లేదా తగ్గించొచ్చు. ఒకవేళ రేట్లు తగ్గినా ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్తో గిట్టుబాటు అయితది.
బొలిశెట్టి లింగారెడ్డి, దండేపల్లి, మంచిర్యాల జిల్లా
ఈసారి సన్నాలే వేస్తా...
నిరుడు వానాకాలంలో నాకున్న రెండెకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకుని దొడ్డు వడ్లు వేసిన. ఎకరానికి70 బస్తాల దిగుబడి వచ్చింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో క్వాలిటీ లేదని కటింగ్ పెడ్తమన్నరు. బయట క్వింటాలు రూ.1,850కి అమ్మిన. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడం సంతోషం. నేను ఈసారి సన్నాలే వేస్తా.
దుర్గం బాపు, ఆలుగామ, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా