జొన్నల డబ్బులేవి .. రెండు నెలలుగా అన్నదాతల ఎదురుచూపులు

జొన్నల డబ్బులేవి .. రెండు నెలలుగా అన్నదాతల ఎదురుచూపులు
  • మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 8 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 270 కోట్లు పెండింగ్ 
  • వానాకాలం సాగు పెట్టుబడికి ఇబ్బందిపడుతున్న రైతన్న

ఆదిలాబాద్, వెలుగు: జొన్న పంటను అమ్ముకున్న రైతులు ఆ డబ్బుల కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. పైసలు రాకపోవడంతో ఇప్పుడు వానాకాలం సాగుకు పెట్టుబడులు పెట్టలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్​లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జొన్న పంట రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఏప్రిల్​లో మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నల కొనుగోళ్లు చేపట్టారు. అయితే పంట విక్రయించిన వారం రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రైతు అకౌంట్​లో డబ్బులు జమచేయలేదు. 

ఆదిలాబాద్ లో అత్యధికంగా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు 1.60 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో వేశారు. యాసంగిలో ఎప్పుడు లక్ష ఎకరాలు కూడా దాటదు కానీ ఈ సారి రికార్డు స్థాయిలో పండించారు. ప్రభుత్వం రెండు నెలలపాటు మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో రైతుల నుంచి జొన్నలు కొనుగోళ్లు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల క్వింటాళ్ల పంట కొనుగోలు చేయగా.. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.270 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. 

కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే 5.60 లక్షల క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేసింది. ఇందుకు గానూ దాదాపు రూ.188 కోట్లు రైతులకు బకాయి పడింది. నిర్మల్ జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాల్లో 2.30 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. రూ. 77.72 కోట్లు రైతులకు జమ చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 16,500 క్వింటాళ్ల కొనుగోళ్లు చేపట్టగా రైతులకు రూ. 5.56 కోట్లు చెల్లించాల్సి ఉంది.   

అధిక వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడి

యాసంగిలో పండించిన జొన్న విక్రయించి ఆ వచ్చిన డబ్బులతో రైతులు వానకాలం సాగుకు పెట్టుబడి పెడుతారు. పంట కొనుగోలు చేసిన తర్వాత వారం రోజులకే డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. రెండు నెలలు గడుస్తున్నా విడుదల చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఖరీఫ్ సాగులో బిజీ అయిన రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు తిప్పలు పడుతున్నారు. చేసేదేంలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలంలో పత్తి సాగుచేసే ఆదిలాబాద్ రైతులు.. అధిక వడ్డీకి  తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పటికైనా డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు.

55 రోజులుగా ఎదురుచూస్తున్నా 

నేను 40 క్వింటాళ్ల జొన్న పంటను అమ్మిన. పంట అమ్మి 55 రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు జమ కాలేదు. జొన్న పంట డబ్బులు వస్తేనే వానాకాలం పంట సాగుకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ పైసలు విడుదల కాకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోంది. వడ్డీలు తెచ్చే విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశా. ప్రభుత్వం త్వరగా జొన్నల డబ్బులు జమ చేయాలి.  

గంగాధర్, కనుగుట్ట, బోథ్ 

మూడు రోజుల్లో జమ అవుతాయి

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్​కు సంబంధించి 5.60 లక్షల క్వింటాళ్ల జొన్న పంటను కొనుగోలు చేశాం. దాదాపు రూ. 188 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో వారి అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

ప్రవీణ్ రెడ్డి , మార్క్​ఫెడ్ డీఎం