ఏటా కనీస మద్దతు ధర రాక నష్టపోతున్న రైతులు
ఈసారి సాధించుకోవాలని ఆరాటం
యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్న రైతు జేఏసీ
నిజామాబాద్ జిల్లాలో పసుపు పండిస్తున్న రైతులు ఈసారి కనీస మద్దతు ధర సాధించుకోవాలని పోరాటానికి రెడీ అవుతున్నారు. ఏటా ఎంఎస్పీ కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఈ దుస్థితికి చెక్ పెట్టాలని, మద్దతు ధర, పసుపు బోర్డు సాధించాలని రైతులు భావిస్తున్నారు. జేఏసీగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెం చేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు.
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో 45 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఏటా పసుపు సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణంలో నిజామాబాద్ జిల్లాదే అగ్రస్థానం. జిల్లాలో ఎక్కువ శాతం పసుపును ఆర్మూర్ డివిజన్లోనే పండిస్తున్నారు. అంకాపూర్, అంక్సాపూర్, మాక్లూర్, నందిపేట్, వేల్పూర్, బాల్కొండ ఏరియాల్లో ఇది ఎక్కువగా సాగవుతోంది. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో ధర్పల్లి, జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్ తదితర మండలాలతోపాటు జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పసుపు పండిస్తున్నారు.
పెట్టుబడి ఎక్కువ..
పసుపు సాగుకు పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా అవుతున్నాయి. పంట కాలం తొమ్మిది నెలలు. శారీరక శ్రమ కూడా ఎక్కువే. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే దిగుబడి బాగా వస్తుంది. తవ్వి తీసే దాకా దాని క్వాలిటీ ఎలా ఉందో రైతులకు తెలియదు. ఒక వేళ క్వాలిటీ బాగా లేకుంటే ధర రాక తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఇంత కష్టపడ్డా మద్దతు ధర అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు.
గత సీజన్లో రూ. 5,500 దాటలేదు..
గత సీజన్లో పసుపు ధర సగటున క్వింటాలుకు రూ.5 వేల నుంచి రూ. 5,500 దాటలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో పసుపు సాగుపై ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు రైతులు.
క్వింటాలుకు రూ. 15 వేలు కనీస మద్దతు ధరగా ప్రకటించాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట చేతికందే టైం. ఈలోగా మద్దతు ధర కోసం గట్టిగా పోరాడాలని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
దేశమంతా తెలిసేలా..
మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ గత ఎంపీ ఎలక్షన్స్ టైంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు పెద్ద ఎత్తున ఎలక్షన్స్లో పోటీ చేశారు. తమ పోరాటంతో దేశం దృష్టిని ఆకర్షించారు. కానీ మద్దతు ధర మాత్రం పొందలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అర్వింద్ ధర్మపురి టర్మరిక్ రీజినల్ బోర్డును జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించారు. దీని ద్వారా పసుపు రైతులకు, పసుపు ఉత్పత్తులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ పసుపు రైతులు మాత్రం ఒప్పుకోవడం లేదు. తమకు పసుపుబోర్డు కావాలని అడిగితే రీజినల్ బోర్డు ఏర్పాటు చేశారని, అది అవసరం లేదని అంటున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ స్పందించడం లేదని ఎంపీ ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధర కోసం సీఎం కేసీఆర్తో కేంద్రానికి లేఖ ఇప్పించాలని జిల్లా
టీఆర్ఎస్ లీడర్లను కోరుతున్నారు.