
వీర్నపల్లి, వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దని రైతులు ఫారెస్ట్ ఆఫీసర్స్ ను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలోని పోడు భూముల్లో ప్లాంటేషన్ లో భాగంగా బుధవారం సర్వే కోసం ఫారెస్ట్ ఆఫీసర్స్ వెళ్లారు. పోడు రైతులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చింత ఏరియాలోని పోడు భూముల్లో 20 ఏండ్లుగా 202 మంది రైతులు సుమారు 200 పైన ఎకరాల్లో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొంత మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు రాగా, మిగిలిన బీసీ, ఎస్సీ, మైనార్టీ రైతులకు అందలేదు.
దీంతో కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్నామని ప్లాంటేషన్ పనులను నిలిపివేసి ఆదుకోవాలని కోరారు. గ్రామంలోని సర్వే నంబర్10 లోని రైతులకు ఇప్పటివరకు ఒరిజినల్ పట్టా లేదన్నారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రైతులకు హక్కు పత్రాలు ఇచ్చినా రైతు బంధు, రైతు బీమా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క సర్వే నంబర్ 10 లో భూమి సమస్యలు ఉండగా, మరో పక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ తో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోయారు. ఎఫ్ఎస్ఓ పద్మలత ను వివరణ కోరగా.. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీహరి ప్రసాద్ ఆదేశాల మేరకు రంగంపేట పోడు భూమిలో ప్లాంటేషన్ చేసేందుకు సర్వే కోసం వెళ్లామన్నారు. రైతులు అడ్డుకోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.