కామారెడ్డి, వెలుగు : మక్కలు, జొన్నలు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కామారెడ్డి – బాన్సువాడ రోడ్డుపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలోనే మండల, జిల్లా స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట దిగుబడులు చేతికొచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుమారు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించడంతో కామారెడ్డి – బాన్సువాడ రోడ్డుపై ఇరువైపులా భారీ సంఖ్యలో వెహికల్స్ నిలిచిపోయాయి. కొద్దిసేపటి తర్వాత రైతులు, నాయకులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రెసిడెంట్ విఠల్రెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్రావు పాల్గొన్నారు.

