
శ్రీనగర్: పుల్వామా దాడి కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. పుల్వామాకు చెందిన పీర్ తారిఖ్ ఆయన కూతురు ఇన్షా జైషే మహ్మద్ టెర్రరిస్ట్ అదిల్ అహ్మద్దర్కు ఆశ్రయం ఇచ్చారని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇన్షా జైషే గతంలో చాలా సార్లు టెర్రరిస్టులకు భోజన సదుపాయాలు, వాళ్లకు కావాల్సిన వస్తువులను సమకూర్చిందని అన్నారు. సోమవారం రాత్రి వాళ్ల ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటికి వరకు ముగ్గురు అరెస్టు అయ్యారు. టెర్రర్ అటాక్కు సహకరించిన జైషే మహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను పోయిన వారమే అరెస్టు చేశారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై టెర్రరిస్టులు దాడి చేయడంతో 40 మంది జవాన్లు చనిపోయారు.