
- పరస్పరం కత్తులతో దాడి చేసుకోగా తీవ్ర గాయాలు
కోరుట్ల,వెలుగు: ఆస్తి పంపకాల విషయమై తండ్రి , కొడుకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లు కలకలం రేపిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కోరుట్ల టౌన్ వివేకానందరోడ్డుకు చెందిన రాచకొండ దేవ భూమయ్యకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు నవీన్తో ఆస్తి పంపకాల విషయంలో తనకు రావాల్సిన వాటాను పంచి ఇవ్వాలని తండ్రితో తరచూ గొడవపడుతున్నాడు. ఈక్రమంలో గురువారం తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చివరకు కత్తిపోట్లకు దారి తీసింది.
కోపోద్రిక్తులైన తండ్రి, కొడుకులు పరస్పరం కత్తులతో దాడికి పాల్పడ్డారు. నవీన్కు తీవ్ర గాయాలు కాగా, భూమయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. నవీన్పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు.