- నిందితుడిని అరెస్ట్ చేసిన ఎడపల్లి పోలీసులు
- మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
ఎడపల్లి, వెలుగు: కూతురిని నమ్మించి బైక్ పై తీసుకొచ్చి తండ్రి చంపేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కేడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన కొండమంగ్లే పాండురంగ బాబురావు, అంకిత దంపతుల కూతురు ప్రాచి(9). కాగా.. గురువారం ఉదయం పాండురంగ బాబురావు బైక్పై తన కూతురిని తీసుకుని వచ్చి ఎడపల్లి మండలంలోని నిజాంసాగర్ డి– 40 కాల్వలో తోసేశాడు. అనంతరం ఏం తెలియనట్టు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
భర్తను కూతురు ఏదని భార్య అడిగితే బంధువుల ఇంటి వద్ద దింపి వచ్చినట్టు నమ్మించాడు. అప్పటికే సోషల్ మీడియాలో బాలిక మృతి వీడియో వైరల్అయింది. ఫొటో ఆధారంగా తల్లి గుర్తుపట్టి వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.
డెడ్ బాడీని చూసి తన కూతురిగా కన్ఫర్మ్ చేసుకుంది. భర్తే హత్య చేసినట్టు ఎడపల్లి పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. పాండురంగ బాబురావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కూతురిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? ఈ హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా ?, హత్యకు కారణాలేమిటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
