కవలపిల్లలకు విషం పట్టించిన తండ్రి.. విషం కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు

కవలపిల్లలకు విషం పట్టించిన తండ్రి.. విషం కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు

ఆడ‌పిల్ల‌లు పుట్టార‌ని ఈ ఘాతుకానికి పాల్పడ్డ తండ్రి

‌పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తేచాలు.. ఆ పిండాన్ని త‌ల్లి గ‌ర్భంలోనే చిధిమేస్తున్నారు కొంద‌రు తల్లిదండ్రులు. ఆ గండాన్ని దాటుకొని భూమి మీదికి వ‌చ్చిన త‌ర్వాత ఆ పసిప్రాణాలను అనంత లోకాల‌కు పంపిస్తున్నారు మ‌రికొంద‌రు. తాజాగా అటువంటి ఘటనే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జరిగింది. ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించ‌డంతో త‌ట్టుకోలేక‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో తండ్రి. ఈ విషాద సంఘ‌ట‌న గండేడ్ మండ‌లంలో చోటుచేసుకున్న‌ది.

మండ‌లంలోని దేశాయిప‌ల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు ఈ నెల 1న రాత్రి క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్ప‌టికే వారికి ఒక కూతురు ఉంది. రెండో కాన్పులోనూ క‌వ‌ల ఆడ‌శిశువులే పుట్టార‌ని కేశ‌వులు ఆవేద‌న చెందాడు. కోపంతో ఆ శిశువుల‌ను చంపేందుకు య‌త్నించాడు. భార్య‌కు తెలియ‌కుండా శిశువుల‌కు పురుగుల మందు తాగించాడు.

పిల్ల‌లు అప‌స్మార‌క స్థితిలోకి చేరుకోవ‌డంతో ఆ శిశువుల‌ను పిల్ల‌ల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ప‌రిశీలించిన వైద్యులు వారిద్ద‌రికి పాయిజ‌న్ అయిన‌ట్లు గుర్తించారు. దాంతో మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు చిన్నారులు జిల్లా ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. కాగా.. కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో న‌మోద‌య్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేశవులును అదుపులోకి తీసుకున్నారు.

For More News..

ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ పాల్గొన్న మోడీ

ఒకే జిల్లాలో వరుస అత్యాచారాలు.. 20 రోజుల్లో ముగ్గురు మైనర్లపై..

దేశంలో రెండోసారి 83 వేలు దాటిన కరోనా కేసులు