
ఆడపిల్లలు పుట్టారని ఈ ఘాతుకానికి పాల్పడ్డ తండ్రి
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తేచాలు.. ఆ పిండాన్ని తల్లి గర్భంలోనే చిధిమేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆ గండాన్ని దాటుకొని భూమి మీదికి వచ్చిన తర్వాత ఆ పసిప్రాణాలను అనంత లోకాలకు పంపిస్తున్నారు మరికొందరు. తాజాగా అటువంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో తట్టుకోలేక ఆ శిశువులకు విషమిచ్చాడో తండ్రి. ఈ విషాద సంఘటన గండేడ్ మండలంలో చోటుచేసుకున్నది.
మండలంలోని దేశాయిపల్లికి చెందిన కృష్ణవేణి, కేశవులు దంపతులకు ఈ నెల 1న రాత్రి కవల ఆడపిల్లలు జన్మించారు. అప్పటికే వారికి ఒక కూతురు ఉంది. రెండో కాన్పులోనూ కవల ఆడశిశువులే పుట్టారని కేశవులు ఆవేదన చెందాడు. కోపంతో ఆ శిశువులను చంపేందుకు యత్నించాడు. భార్యకు తెలియకుండా శిశువులకు పురుగుల మందు తాగించాడు.
పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆ శిశువులను పిల్లల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పరిశీలించిన వైద్యులు వారిద్దరికి పాయిజన్ అయినట్లు గుర్తించారు. దాంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కేశవులు పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేశవులును అదుపులోకి తీసుకున్నారు.
For More News..