తండ్రి రైల్వేలో ఆఫీసర్.. కొడుకు డ్రగ్స్ ​స్మగ్లర్

తండ్రి రైల్వేలో ఆఫీసర్..  కొడుకు డ్రగ్స్ ​స్మగ్లర్

    లగ్జరీ లైఫ్​కోసం పక్కదారి పట్టిన యువకుడు 

    ఇంజినీరింగ్​లోనే డ్రగ్స్​అలవాటు 
    అమ్మడానికి వెళ్తూ అడ్డంగా చిక్కాడు 
    రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

మాదాపూర్​, వెలుగు  : ఆ యువకుడి తండ్రి రైల్వే డిపార్ట్​మెంట్​లో ఇంజినీర్..కొడుకును కూడా ఇంజినీర్​గా చూడాలనుకుని బీటెక్​చదివించాడు. అయితే డ్రగ్స్​కు బానిసైన అతడి కొడుకు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అది కంటిన్యూ చేయడానికి, డ్రగ్స్ కొనడానికి ​మాదకద్రవ్యాలను అమ్మడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు అడ్డంగా చిక్కాడు. 

మాదాపూర్​ పోలీసుల కథనం ప్రకారం..రాజమండ్రిలోని పాతపేటకు చెందిన కాటూరి సూర్యకుమార్​(22) బెంగళూరులోని జైన్​ యూనివర్సిటీలో బీటెక్​చదివాడు. అప్పుడే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. బెంగళూరుకు చెందిన తన ఫ్రెండ్​అభి ద్వారా నైజీరియన్​కు చెందిన డ్రగ్స్​ స్మగ్లర్​గాడ్​ ఆఫ్​ సోల్మెన్​తో పరిచయమైంది. ఇతని నుంచి సూర్యకుమార్​ఎండీఎంఏ కొని వాడేవాడు. డ్రగ్స్​అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని, దాంతో లగ్జరీ లైఫ్​ అనుభవించవచ్చని భావించిన సూర్య డ్రగ్స్​అమ్మడం మొదలుపెట్టాడు.  

జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలే..

సూర్యకుమార్​గత ఏడాది డ్రగ్స్​స్మగ్లింగ్​చేస్తూ చందానగర్​పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. మూడు నెలల పాటు శిక్ష అనుభవించి వచ్చినా కూడా అతడి తీరులో మార్పు రాలేదు. మళ్లీ బెంగళూరుకు వెళ్లి నైజీరియర్​ సోల్మెన్​వద్ద ఎండీఎంఏ కొని వాడేవాడు. ఈ డ్రగ్​ను రాజమండ్రికి చెందిన చిన్ననాటి ఫ్రెండ్,​ బీటెక్​ స్టూడెంట్​ అయిన శ్యామ్​బాబుకు కూడా అలవాటు చేశాడు.ఈ నెల 14న బెంగళూరుకు వెళ్లి సోల్మెన్​వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొన్నాడు. 16న హైదరాబాద్​కు చేరుకొని తన ఫ్రెండ్​ శ్యామ్​బాబును రాజమండ్రి నుంచి హైదరాబాద్​పిలిపించాడు. 

ఇద్దరూ కలిసి మాదాపూర్​చంద్రనాయక్​తండాలోని ఓ అపార్ట్​మెంట్​లో రెండు గ్రాముల ఎండీఎంఏను వాడారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని స్టూడెంట్స్​కు  ఒక్క గ్రాముకు రూ.10వేల నుంచి 15 వేల వరకు విక్రయించాలని రెడీ అయ్యారు. సమాచారం అందుకున్న మాదాపూర్​జోన్​ఎస్​ఓటీ పోలీసులు అపార్ట్​మెంట్​వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రూ.5.70 లక్షల 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకొని మాదాపూర్​ పోలీసులకు అప్పగించారు.