తండ్రి చనిపోయిండని..కిరోసిన్ పోసుకుని కాల్చుకున్న కూతురు
రాజాపేట, వెలుగు: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురంలో మంగళవారం చోటుచేసుకుంది. రఘునాధపురం గ్రామానికి చెందిన బోగ వెంకటేశ్(57)కు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం వెంకటేశ్అనారోగ్యానికి గురవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
మంగళవారం ఉదయం వెంకటేశ్ మరణించాడు. తండ్రి మరణవార్త విన్న కూతురు నవనీత(24 ) నాన్న లేని జీవితం నాకొద్దంటూ బాత్రూమ్ లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన బంధువులు, గ్రామస్తులు వెంటనే మంటలు ఆర్పి ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. శరీరభాగాలు ఎక్కువ శాతం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించారు.