
బెంగళూరు మహానగరం ట్రాఫిక్కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. ఇటీవలే ఓ నెటిజన్ బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru Traffic)కు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్ కార్లు ( luxurious Ferrari supercars) ట్రాఫిక్లో వరుస కట్టాయి.
ఫెరారీ కార్లను విలాసవంతంగా గడిపేవారు ఉపయోగిస్తారు, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉపయోగించిన స్పోర్ట్స్ కారు. ఇవి చాలా ఖరీదైనవి.. ఫెరారీ కార్ల కంపెనీ బ్రాండ్ కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది. ఇవి చాలా స్పీడుగా వెళతాయి. తాజాగా ఇలాంటి కార్లు బెంగళూరు రోడ్లపై కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫెరారీ కార్లు బెంగళూరు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో నెటిజన్లు వీడియోతీసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్థానిక చర్చ్ స్ట్రీట్ బెల్ రోడ్లో సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ మధ్యలో సుమారు 10కిపైగా ఫెరారీ కార్లు ఒకదాని వెనుక చిక్కుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను @pavangamemaster అనే నెటిజన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘బెంగళూరులో ఫెరారీ ట్రాఫిక్’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం) 72 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. - కారు కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేసి, బెంగళూరు ట్రాఫిక్లో కారు ఇరుక్కుపోతే ఇలా జరుగుతుందని ఒకరు కామెంట్ చేశారు. వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ కూడా ఈ వీడియోపై స్పందించారు.
ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఫెరారీ కార్లు..
ఈ వీడియోలో బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్డుపై అనేక వాహనాలు, ప్రజలు నిలబడి ఉన్నారు. ఈ ట్రాఫిక్ లో ఫెరారీ వాహనాలు కూడా జామ్లో చిక్కుకున్నాయి. పసుపు, ఎరుపు... ఇలా రకరకాల రంగుల్లో మెరిసిపోయే కార్లు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్లో నిలబడిన వ్యక్తులు వాహనాల ఫొటోలు తీస్తూ, వీడియోలు కూడా తీశారు.
సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. పని మీద బయటకు వెళ్లాలంటనే ట్రాఫిక్ బారులను చూసి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది,