గెట్టు పంచాయితీ.. గొడ్డండ్లు లేచాయి

గెట్టు పంచాయితీ.. గొడ్డండ్లు లేచాయి
  • ​​​​​​ అన్నదమ్ముల మధ్య కొట్లాట

యాదాద్రి,వెలుగు:ఫ్యాక్షన్​ తరహాలో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో అన్నదమ్ములు గొడ్డండ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.  విచక్షణారహితంగా దాడులు చేసుకొని తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అడ్డగూడూరు ఎస్​ఐ ఉదయ్​ కిరణ్​ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.   మండలంలోని మానాయికుంటకు చెందిన అన్నదమ్ములు వీరయ్య, మార్త సైదులుకు తండ్రి బుచ్చయ్య నుంచి వారసత్వంగా భూమి  వచ్చిందన్నారు. 

Also Read : ధరణి వల్లే రైతుల తిప్పలు

సర్వే నెంబర్​ 682లో చెరో మూడు ఎకరాల పంపకం జరిగింది. మరో రెండు ఎకరాల పంపకాలతో పాటు గెట్టు పంచాయితీ కొనసాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య తగదాలు మొదలయ్యాయి. పలుమార్లు గొడవలు జరగడంతోపెద్ద మనుషుల సమక్షంలో మంగళవారం పంచాయితీజరిగింది.బుధవారం హద్దులు పాతుకోవాలని నిర్ణయించారు. హద్దుల ఏర్పాటు కాకముందే మార్త వీరయ్య, కొడుకు ప్రభాస్​తో కలిసి బుధవారం దున్నకాలు చేపట్టాడు.

విషయం తెలుసుకున్న సైదులు, తన కొడుకు శేఖర్​తో కలిసి ఆగ్రహంతో గొడ్డండ్లు తీసుకొని  వీరయ్య వద్దకు వెళ్లాడు. వీరయ్య, అతడి కొడుకు ప్రభాస్​కూడా గొడ్డండ్లు తీసుకొని పరస్పరం దాడులకు తెగబడ్డారు. దాడుల్లో  ప్రభాస్ తలకు గాయాలయ్యాయి. శేఖర్​వెన్నుపూసతో పాటు చేతిపై గొడ్డలి వేటు పడింది. సైదులు అరచేయి తెగి కిందపడిపోయింది.వీరయ్య భుజంపై గొడ్డలి వేటు పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలతో పడి ఉన్న నలుగురిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయాలకు గురైన ప్రభాస్​, శేఖర్​ పరిస్థితి సీరియస్​గా ఉన్నట్టు తెలుస్తోంది.