
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర శివారులో నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి భూములను ఫైనల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్యారానగర్, చౌటుప్పల్, లక్డారం, కేశంపేట్ ప్రాంతాల్లో డంపింగ్యార్డులు ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాలను గతంలోనే పరిశీలించారు. ఇందులో ప్యారానగర్ లో డంపింగ్ యార్డు ఫైనల్ కావడంతో పాటు దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. అయితే, స్థానికులు కొందరు కోర్టుకు వెళ్లడంతో పనులకు బ్రేక్ పడింది.
జవహర్నగర్పై పెరుగుతున్న లోడ్
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ పనులు స్టార్ట్అయినప్పుడు గ్రేటర్ నుంచి రోజూ 2,500 -నుంచి 3 వేల టన్నుల చెత్త యార్డుకి వచ్చేది. ఇప్పుడు రోజూ 8 వేల టన్నుల చెత్త వస్తుండటంతో సమస్య తీవ్రమైంది. ఇప్పటికే యార్డులో 1.48 లక్షల టన్నుల చెత్తని మూడు లేయర్లతో క్యాపింగ్ చేశారు. రోజూ వస్తున్న 8 వేల టన్నుల చెత్తని ప్రాసెసింగ్ చేసి విద్యుత్ తయారు చేస్తున్నారు. అయినా, ఈ యార్డుపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇచ్చిన హామీ మేరకు..
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి శాశ్వత విముక్తి కల్గిస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే దుండిగల్ లో 14.5 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చింది. జవహర్ నగర్ ప్లాంట్ లో ప్రాసెస్ పూర్తయిన తర్వాత 600 టన్నుల చెత్తని ఇక్కడకు తరలించి విద్యుత్తయారు చేస్తున్నారు. అలాగే, జవహర్నగర్పై ఒత్తిడి పెరుగుతుండడంతో సిటీకి నలుమూలలా నాలుగు డంపిండ్ యార్డులు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి స్థలాల సేకరణ పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు.