న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బడ్జెట్పై ఆయ న చేసిన ‘సత్తాలేని డాక్టర్లు’ కామెంట్కు అదే రీతిలో రిప్లై ఇచ్చారు. ఎఫ్డీఐలు వెళ్లిపోయి, క్రోనీలు బ్యాం కులోన్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోవడానికి కారణమైన వారి ‘తప్పుడు నిర్ణయాల’ నుంచి తాను నేర్చుకోవాల్సినగతి పట్టలేదని అన్నారు. మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె కాంగ్రెస్, చిదంబరంపై విరుచుకుపడ్డారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందని చెప్పడానికి ఏడు ముఖ్యమైన మాక్రో ఇండికేటర్లే సాక్ష్యం. ఎకానమీకి ఎలాంటి నష్టం లేదు. అందుకోసం ఎన్నెన్నో చర్యలు చేపట్టాం’’ అని లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభలో మాట్లాడారు. అక్కడే చిదంబరంపై మండిపడ్డారు. 2008–2009లో యూపీఏ చేసిన తప్పులను తాము రిపీట్ చేయదలచుకోలేదన్నారు.
ముందే అప్పులిచ్చిన్రు.. ఎన్పీఏలు పెంచిన్రు
ఎకానమీని పెంచాలన్న ఉద్దేశంతో నాటి యూపీఏ సర్కారు అప్పులను విపరీతంగా ఇచ్చేసిందని, కొన్ని లోన్లను అడ్వాన్స్గానూ ఇవ్వడం వల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు– ఎన్పీఏ)లు పెరిగిపోయాయని మండిపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ పరిస్థితి దాపురించిందన్నారు. కాబట్టి ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ ఆర్థిక వ్యవస్థపై భారం పడేలా చేసే అలాంటి తప్పుడు నిర్ణయాలను తీసుకోబోమన్నారు. అటల్బిహారీ వాజ్పేయీ ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల, 2004, 2014 టర్మ్లలో కాంగ్రెస్కు ‘అదృష్టం’ కలిసొచ్చిందన్నారు. సలహాలు, సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటామని, కానీ, పదే పదే అవాకులు, చవాకులు పేలితే మాత్రం ఊరుకోబోమని అన్నారు. యూపీఏ విధానాల వల్ల 2014లో బ్యాంకులు ట్విన్ బ్యాలెన్స్ షీట్ (ఓవైపు బ్యాంకుల్లో ఎన్పీఏలు పెరగడం, మరోవైపు కార్పొరేట్ల అప్పులు పేరుకుపోవడం) సంక్షోభంలో మునిగిపోయాయన్నారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని క్రోనీలు దేశం వదిలి పారిపోయారన్నారు. వాటికి కారణమైన కాంగ్రెస్ తప్పుడు విధానాలను తాము రిపీట్ చేయబోమన్నారు. మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. మంగళవారం రెండు సభలు వాయిదా పడ్డాయి. మార్చి 2, ఏప్రిల్ 3న బడ్జెట్ ఆమోదం కోసం మళ్లీ సమావేశమవుతాయి.