- కాల్మనీలో హోల్సేల్ డిజిటల్ రూపాయి
- అక్టోబర్లో పైలెట్ ప్రాజెక్ట్
న్యూఢిల్లీ : బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ సంస్థలు ఒకరి దగ్గర నుంచి ఒకరు లోన్లు తీసుకోవడానికి త్వరలో డిజిటల్ రూపాయిలను కూడా వాడనున్నాయి. కాల్మనీ లేదా ఇంటర్బ్యాంక్ బారోవింగ్స్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలెట్ ప్రాజెక్ట్ను ఆర్బీఐ వచ్చే నెల లాంచ్ చేయనుంది. హోల్సేల్ సీబీడీసీ (డిజిటల్ రూపాయి– హోల్సేల్) ని కిందటేడాది నవంబర్ 1 న పైలెట్ బేసిస్లో లాంచ్ చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీల(బాండ్ల) ట్రాన్సాక్షన్లలో వీటిని వాడుతున్నారు.
‘ఆర్బీఐ హోల్సేల్ సీబీడీసీని వచ్చే నెల లేదా ఆ తర్వాత నెలలో కాల్మనీ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది’ అని జీ20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొన్న ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ అన్నారు. సీబీడీసీని 2022–23 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్బీఐ చట్టం,1934 లో కొన్ని సెక్షన్లను ఫైనాన్స్ బిల్లు 2022 కింద సవరించారు. హోల్సేల్ సీబీడీసీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి బ్యాంకులను హోల్సేల్ సీబీడీసీ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఆర్బీఐ ఎంచుకుంది. దీంతో పాటు సీబీడీసీ రిటైల్ (ఈ–రూపాయి రిటైల్) పైలెట్ ప్రాజెక్ట్ను కిందటేడాది డిసెంబర్ 1 న లాంచ్ చేశారు. కాగా, డిజిటల్ రూపాయి లీగల్ టెండర్. ఫిజికల్ కరెన్సీకి ఉన్న అన్ని ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న నోట్లు, కాయిన్స్ డినామినేషన్లను డిజిటల్ రూపాయి కింద కూడా తీసుకొచ్చారు.