మంత్రి ఆఫీస్ లో పని చేస్తున్నానంటూ మోసం... రూ.3 లక్షలు కాజేసిన మహిళపై ఎఫ్ఐఆర్

మంత్రి ఆఫీస్ లో పని చేస్తున్నానంటూ మోసం... రూ.3 లక్షలు కాజేసిన మహిళపై ఎఫ్ఐఆర్

జూబ్లీహిల్స్, వెలుగు: మంత్రి ఆఫీస్​లో పని చేస్తున్నాను.. ప్రభుత్వ బిల్లులు క్లియర్ చేయిస్తానంటూ ఓ సివిల్ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మించి, రూ.3 లక్షలు కాజేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్​నమోదు చేశారు. బండ్లగూడ జాగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తన పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు విడుదల చేయించేందుకు 2024లో వి.పుష్పలతను సంప్రదించాడు. ఆమె తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆఫీస్​లో పని చేస్తున్నానని చెప్పి, పని పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. ఆమె మాటలు నమ్మిన శ్రీనివాస్ గౌడ్ రూ.3 లక్షలు ఇచ్చాడు. 

తర్వాత పుష్పలత బిల్లులు రిలీజ్​చేయించలేదు. పలుమార్లు కాల్స్​చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా మంత్రిని సంప్రదించి ఆరా తీయగా.. ఈ వ్యవహారానికి మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ గౌడ్ పుష్పలతపై శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్​నమోదు చేసి, కేసును ఖైరతాబాద్ పోలీస్​స్టేషన్​కు ట్రాన్స్​ఫర్​చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.