
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే (AIADMK) నేతను బెదిరించారన్న ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశారు. AIADMK నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి.. శశికళ మద్దతుదారుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు.. శశికళపై పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
కొన్నేళ్ల కిందట AIADMK నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు, కార్యకర్తల మద్దతును కూడా ఆమె కూడగట్టుకున్నారు. అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు శశికళ. అయితే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. అయితే పార్టీ నామరూపాల్లేకుండా పోవడాన్ని తాను చూడలేనని శశికళ అన్నారు.