న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) గురువారం డిమాండ్ చేసింది. ఈ అవినీతికి పాల్పడి, దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ విషయమై వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ‘పీటీఐ’తో మాట్లాడారు. నాలుగు నెలల్లోపే ఈ దర్యాప్తును పూర్తి చేయాలని ఆయన కోరారు.
విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు జరుపుతున్న ‘సిట్’ మంగళవారం ప్రభుత్వానికి తన ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించిన నేపథ్యంలో వీహెచ్పీ ఈ డిమాండ్ చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ నివేదికను హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్కు అందజేశారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.
