గండిపేట, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ ఠాణా దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనతను సాధించింది. ఈనెల5న జైపూర్లో జరిగే డీజీపీల కాన్ఫరెన్స్లో అవార్డును అందుకోవాల్సిందిగా పేర్కొంది. శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారం, ఠాణాకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడడం వంటి అంశాల్లో మంచి మార్కులను కొట్టేసింది.
మహిళా భద్రతలోనూ టాప్ ప్లేస్ సాధించింది. మిస్సింగ్ కేసులను త్వరితగతిన ట్రేస్ , కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్తో ఠాణా స్థాయిలోనే పరిష్కరించడం వంటి అంశాల్లోనూ మంచి స్కోరును సాధించింది. వీటితో పాటుగా గుర్తు తెలియని వ్యక్తులు మరణించినప్పుడు, డెడ్బాడీలు దొరికనప్పుడు, వెంటనే గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడం, పోస్టుమార్టం తర్వాత వెంటనే అప్పగించడంపై రాజేంద్రనగర్ పోలీసుల పనితీరును కేంద్రహోం శాఖ ప్రత్యేకంగా అభినందించింది.