ఆరేళ్లుగా మత్స్య పరిశోధన కేంద్రంలోనే చేపల దాణా తయారీ యంత్రం

ఆరేళ్లుగా మత్స్య పరిశోధన కేంద్రంలోనే చేపల దాణా తయారీ యంత్రం

రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా కేజ్​ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న అధికారులు, అవసరమైన సౌకర్యాలపై మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్​లో ​పది కేజ్​ కల్చర్​ యూనిట్లను 2015లో ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ లో 3 వేల చేపల చొప్పున 3 లక్షల చేపలను పెంచుతున్నారు. ఈ చేపల పెంపకం కోసం అవసరమైన మేత (దాణా)ను తయారు చేసేందుకు ఫీడ్​ మిషన్​ను రూ.14.50 లక్షలతో 2016లో మంజూరు చేశారు. అప్పటి నుంచి ఫీడ్​ మిషన్​ను పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఉంచారు. ఫీడ్​ మిషన్​ ఏర్పాటు కోసం షెడ్డు నిర్మాణం, కరెంట్ కనెక్షన్​ను మత్స్యకార సంఘం తరపున ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి రూ.18 లక్షల వరకు ఖర్చు కానుండగా, అంత డబ్బు సొసైటీ దగ్గర లేదంటూ సభ్యులు చెబుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా షెడ్​ నిర్మించకపోవడంతో మిషన్​ నిరుపయోగంగా మారింది. షెడ్ నిర్మించేందుకు అవసరమైన రెండున్నర గుంటల భూమిని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఏడాదికి రూ.3 వేలు అద్దె చెల్లించే విధంగా 30 ఏండ్ల పాటు లీజు అగ్రిమెంటు చేసుకున్నారు.  

కైకలూరు నుంచి ఫీడ్..

పాలేరు రిజర్వాయర్​ లో 1620 మంది మత్స్యకార సొసైటీ సభ్యులు ఉండగా, కేజ్​ కల్చర్​ యూనిట్లలో 150 మంది సభ్యులున్నారు. చేపల దాణాకు అవసరమైన కొబ్బరి చెక్క, తవుడు, ఇతర ముడి సామగ్రి తెచ్చుకుంటే ఫీడ్​ మిషన్​ ద్వారా కిలోకు రూ.30 ఖర్చుతో దాణా తయారవుతుంది. మిషన్​ లేకపోవడంతో ఇప్పుడు ఏపీలోని కైకలూరు నుంచి కిలో రూ.70 చొప్పున దాణా కొనుక్కోవాల్సి వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. రోజుకు 8 క్వింటాళ్ల మేత అవసరం ఉండగా, రూ.56 వేల ఖర్చవుతోందని అంటున్నారు. ఖర్చు భరించలేక సగం దాణా మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో 6 నెలల్లో పెరగాల్సిన చేపలు, ఏడాది అయినా పెరగడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. 

షెడ్​ నిర్మాణం కోసం  రూ.18 లక్షలు కావాలి

ఫీడ్​ మిషన్​ మంజూరై ఏడేండ్లు అవుతున్నా దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేదు. కేజ్​ కల్చర్​ మత్స్యకారుల వాటా కింద షెడ్​ నిర్మాణం, కరెంట్​ కనెక్షన్​ ఏర్పాటు చేయాలని అధికారులు అంటున్నారు. దీనికి రూ.18 లక్షలు ఖర్చవుతుంది. ఇంత డబ్బు సొసైటీలో లేదని చెప్పాం. మత్స్యశాఖ, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి షెడ్​ నిర్మాణానికి సహకరించాలి.

- ఏడుకొండలు, పాలేరు మత్స్య సహకార సంఘం కార్యదర్శి

కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తా

పాలేరులో ఫీడ్​ మిషన్​ ఏర్పాటు విషయం ఇటీవల మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకారుల వాటా, ప్రభుత్వం నుంచి కొంత వాటా తీసుకొని రేకుల షెడ్​ నిర్మించేందుకు ప్రయత్నిస్తా. కరెంట్​ కనెక్షన్, ఇతర రా మెటీరియల్​ తీసుకువచ్చి ఫీడ్​ మిషన్​ను త్వరలోనే ఏర్పాటు చేయిస్తా. 

- దోమల ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి