లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ
  • సొసైటీ ఏర్పాటుకు 50 వేలు అడిగిన జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్
  • కలెక్టరేట్​లో నోట్ల దండ వేసి నిరసన తెలిపిన మత్స్యకారులు

జగిత్యాల, వెలుగు : సొసైటీ ఏర్పాటుకు లంచం డిమాండ్​ చేస్తున్నారని ఆరోపిస్తూ.. జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ వేసి మత్స్యకారులు నిరసన తెలిపారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్ దామోదర్ సొసైటీల  ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మత్స్య సొసైటీల సభ్యులు ఫైర్​ అయ్యారు.

మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన మత్య్సకారుల కోసం కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని దామోదర్ డిమాండ్ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. సోమవారం మత్స్యశాఖ ఆఫీసుకు వెళ్లి దామోదర్​ను నిలదీశారు. అయితే, “నా వెనుక మినిస్టర్ ఉన్నారు. నన్ను మీరేం చేయలేరు..”అని బెదిరించారని, దీనికి సంబంధించి తమ దగ్గర ఆడియో క్లిప్ లు కూడా ఉన్నాయని  మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ తెలిపారు.

అనంతరం వారు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మత్స్య శాఖ ఆఫీసర్ దామోదర్ బయటకు రాగానే ఆయన మెడలో నోట్ల దండ వేసి  నిరసన తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించారు. జిల్లా మత్స్య శాఖ అధికారి దామోదర్ పై  ఫిర్యాదు అందిందని,  ఘటనపై ఆయన వివరణ కోరినట్టు తెలిపారు. మత్స్యకారుల ఆరోపణలపై  విచారణ చేపడతామని చెప్పారు.