హైదరాబాద్, వెలుగు: వాహనాల్లో ‘స్పీడ్ గవర్నర్’అమలుపై ఆర్టీఏ కొత్త రూల్ తెచ్చింది. స్పీడ్ గవర్నర్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) రెన్యువల్ చేయాలని గత శుక్రవారం అన్ని ఆర్టీఏ ఆఫీసులకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెనింగ్ కానున్నాయి. దీంతో స్కూల్ బస్సుల ఎఫ్సీల కోసం సోమవారం ఆర్డీఏ ఆఫీసులకు వచ్చిన పాఠశాలల యాజమాన్యాలు కొత్త నిబంధన తెలిసి షాక్ తిన్నాయి. కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, స్పీడ్ గవర్నర్ ఉంటేనే ఎఫ్సీ జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక స్కూల్ బస్సులకు ఎఫ్సీ చేయించుకోకుండానే వెనుదిరిగారు.
రెండు నెలల క్రితమే జీవో?
2015 ఏప్రిల్ 15న కేంద్ర రవాణా శాఖ స్పీడ్ గవర్నర్ అమలుకు సంబంధించి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. స్కూల్ బస్సులు, డంప్ చేసే వాహనాలు, ట్యాంకర్లు, 8 సీటింగ్ కెపాసిటీ ఉండే ప్యాసింజర్ వెహికిల్స్, హానికరమైన రసాయనాలు, ఇతర పదార్థాలు రవాణా చేసే వాహనాలకు స్పీడ్ గవర్నర్ తప్పనిసరి అని ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కమిటీ వేసి సలహాలు, సూచనలు స్వీకరించింది. వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ చేసే సమయంలో ఆర్టీఏ అధికారులు స్పీడ్ గవర్నర్ను పరీక్షిస్తారు. స్పీడ్ గవర్నర్ లేకుంటే ఎఫ్ సీ జారీ చేయరు. 2015 అక్టోబర్ తర్వాత తయారైన వాహనాలకు స్పీడ్ గవర్నర్ ఇన్బిల్ట్గా వస్తోంది. 2015 అక్టోబర్ కంటే ముందు వాహనాలకు స్పీడ్ గవర్నర్ కచ్చితంగా అమర్చుకోవాలి. కొత్త రూల్స్ ప్రకారం 2015 అక్టోబర్ కంటే ముందున్న వాహనాలకు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని పరిమితిగా విధించారు. ఆ తర్వాత వచ్చిన వాహనాలకు గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని నిర్ణయించారు. ఈ ఏప్రిల్లో స్పీడ్ గవర్నర్ను తప్పకుండా అమలు చేయాలని జీవో జారీ చేసినట్లు తెలిసింది. అయితే దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఈ నెల 7న అన్ని కార్యాలయాలకూ ఉత్తర్వులు జారీ చేసింది.
12,947 బస్సులకు నో ఫిట్నెస్
రాష్ట్రంలో 26,091 స్కూల్ బస్సులు ఉన్నాయి. సోమవారం వరకు 13,144 బస్సులకు మాత్రమే ఎఫ్సీ రెన్యూవల్ చేశారు. 12,947 బస్సులు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంది. స్కూళ్ల ఓపెనింగ్కు ఒక్క రోజు మాత్రమే ఉంది. తాజా రూల్స్తో ఈ బస్సులకు వెంటనే రెన్యూవల్ చేసే అవకాశం లేదు. మరోవైపు స్కూల్ యాజమాన్యాలు కూడా ఎఫ్సీ రెన్యూవల్పై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో ఫిట్నెస్ లేని బస్సుల్లోనే స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.