కామారెడ్డి జిల్లాలో ఐదుగురు బైక్​ దొంగల అరెస్ట్

 కామారెడ్డి జిల్లాలో ఐదుగురు బైక్​ దొంగల అరెస్ట్
  •     రూ.36.60 లక్షల విలువైన 51 బైకులు స్వాధీనం

కామారెడ్డి, వెలుగు : బైక్​దొంగతనాలకు పాల్పడుతున్న అయిదుగురు దొంగల్ని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందులో ఒకరు కరడుగట్టిన అంతర్​ రాష్ట్ర దోపిడి దొంగ. మరో నలుగురు అంతర్​జిల్లా దొంగలు. వీరి నుంచి రూ.36.60 లక్షలు విలువైన 51 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ​ఆఫీసులో  ఎస్పీ బి.శ్రీనివాస్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో వరుసగా బైక్​చోరీలు జరుగుతున్న నేపథ్యంలో అడిషనల్​ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీ ప్రకాశ్​పర్యవేక్షణలో  సీసీఎస్, టౌన్​పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారన్నారు. 

మహారాష్ట్రలోని జాల్నా గురు గోవింద్​నగర్​కు చెందిన జుల్పీ సింగ్​అలియాస్​ సూరత్​సింగ్ మహారాష్ట్రతో పాటు పలు ఏరియాల్లో దోపిడీలకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఇతడిపై పలు కేసులు ఉన్నాయి. కరోనా టైమ్​లో ఫేరోల్​పై ఇంటికొచ్చి తప్పించుకొని తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బాన్సువాడ, కరీంనగర్​లలో ఉంటూ బైక్​లు చోరీ చేస్తున్నాడు.మంగళవారం కామారెడ్డిలో బైక్​పై వెళ్తుండగా ఇతడ్ని పట్టుకొని ఎంక్వైరీ చేయగా   బైక్​చోరీల విషయం బయట పడింది. ఇతడి నుంచి 12 బైక్​లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ  చెప్పారు. 

మరో నలుగురు ..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆజాంపురాకు చెందిన షేక్​యూనుస్, బాన్సువాడకు చెందిన షేక్​ సోయెల్, హైదరాబాద్​లోని యాకుత్​పుర వాసి సోహెల్​అలీ, నారాయణ్​పేట జిల్లా వాసి (ప్రస్తుతం బంజరాహిల్స్)  చప్పల అంజప్పకలిసి పలు జిల్లాల్లో బైక్​లను చోరీ చేస్తున్నారు. కామారెడ్డిలో  బైక్​లపై వెళ్తుడగా కస్తూరీబా హాస్పిటల్​ సమీపంలో పోలీసులు వెహికిల్స్​తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డట్లు ఎస్పీ తెలిపారు. అనుమానంతో ఎంక్వైరీ చేయగా బైక్​దొంగలుగా గుర్తించారు. వీరి నుంచి 39 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని

 బైక్​లు చోరీ చేసి తీసుకొచ్చి అమ్ముతుంటే తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. పిట్లంకు చెందిన షేక్​ఇర్ఫాన్, బిచ్కుంద వాసి షేక్​హమీద్, బాన్సువాడకు చెందిన మహ్మద్ ​ఉమేర్, కామారెడ్డి బతుకమ్మకుంట వాసి షేక్​అల్తాఫ్​లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీ ప్రకాశ్, సీఐలు నరేశ్, మల్లేశ్​గౌడ్, ఎస్ఐలు ఉస్మాన్, అనిల్, ఏఎస్​ఐలు రాజేశ్వర్​రావు, శ్రీనివాస్  సిబ్బంది పాల్గొన్నారు.