
- బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ .. ఐదుగురు మావోయిస్టులు మృతి చనిపోయిన వాళ్లలో
- ఇద్దరు మహిళలు.. వారిని గుర్తించాల్సి ఉందన్న ఎస్పీ
- పది మందిని అదుపులోకి తీసుకున్నారని పౌర హక్కుల సంఘం ఆరోపణ
- వాళ్లను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రం ఇంద్రావతి నది నేషనల్ పార్కు ఏరియాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు ఎవరనేది గుర్తించాల్సి ఉందని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ తెలిపారు. నేషనల్ పార్కు ఏరియాలో గత మూడు రోజులుగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నెల 5న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందగా 6వ తేదీన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్చనిపోయారు. తాజాగా శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆటోమెటిక్ గన్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ పార్కు ఏరియాలో80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పోలీస్స్టేషన్, బేస్క్యాంపులు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్గా ఎంచుకుని తలదాచుకున్నట్టు తెలుస్తున్నది. ఇది పసిగట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
అడవిలో జవాన్ల కష్టాలు
ఈ నెల 4న డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు ఇంద్రావతి నది నేషనల్ పార్కు ఏరియా అడవుల్లోకి ప్రవేశించాయి. మూడు రోజులుగా అడవిలోనే సెర్చింగ్ కొనసాగుతుండడంతో విపరీతమైన ఎండలకు జవాన్లు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. ఒక జవాన్ను పాము కరిచినట్టు తెలిసింది. మరి కొందరు జవాన్లపై తేనె టీగలు దాడి చేశాయి. దీనితో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సుమారు ఏడుగురు జవాన్లు అస్వస్థతకు గురికావడంతో వారిని హెలికాప్టర్తో తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.