
మహిళలపై దాడుల కేసుల్లో శిక్షల శాతం పెరిగింది: షికా గోయల్
హైదరాబాద్, వెలుగు: మహిళలు, చిన్నారులపై జరిగిన అత్యాచారాలు, దాడుల కేసుల్లోశిక్షల శాతం పెరిగిందని రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్ షికా గోయల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని అన్నారు. కేసుల దర్యాప్తుపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ ఏడాది శిక్షల వివరాలను శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
ఈ సంవత్సరం ఇప్పటికే12కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించాయని తెలిపారు.ఇద్దరికి జీవితఖైదు, ఒకరికి 25 ఏండ్లు, ఐదుగురికి 20 ఏండ్లు, ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టులు తీర్పు చెప్పాయన్నారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో.. 6 కేసుల్లో శిక్షలు పడగా అందులో రెండు జీవిత ఖైదులు ఉన్నాయని వివరించారు.
విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సమన్వయంగా పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఆయా కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో పనిచేసిన13మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, ఏడుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,12 మంది కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, ఇద్దరు భరోసా లీగల్ ఆఫీసర్లకు షికా గోయల్ సర్టిఫికెట్స్ అందించారు.