కారు, ట్రక్కు ఢీ: ఐదుగురు యూట్యూబర్లు మృతి

కారు, ట్రక్కు ఢీ: ఐదుగురు యూట్యూబర్లు మృతి

గువాహటి: అస్సాంలోని దరంగ్ జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు యూట్యూబర్లు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం షూటింగ్ ముగించుకుని యూట్యూబర్లు కారులో తిరిగి వస్తుండగా దరంగ్ జిల్లాలోని నేషనల్ హైవే 15పై ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురూ దుర్మరణం చెందారు. మొదట ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేసిన కారు.. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన ఇస్లాం, ఆజాద్, ఇబ్రహీం అనే ముగ్గురు ‘ఎస్ఆర్ అఫీషియల్’ అనే యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. వీరి షూటింగ్ కు ‘ఎస్ హెచ్ ప్రొడక్ట్’ చానెల్ ఓనర్ సానియా, ఆమె తల్లి కూడా రాగా, యాక్సిడెంట్​లో అందరూ మృత్యువాతపడ్డారు. వీరు ఆరు నెలల కిందటే యూట్యూబ్ చానెల్స్ ప్రారంభించగా, కొద్దికాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నారు. యాక్సిడెంట్​లో మరికొందరు కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి సీరియస్​గా ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, యాక్సిడెంట్ల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.