ఇవాళ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో బీజేపీపై కాంగ్రెస్ చార్జ్షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ నేతలు హాజరుకానున్నారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
ఈ సందర్భంగా... ప్రధాని మోడీ సర్కార్ 10 ఏళ్ల మోసంపై గాంధీ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. మోదీ నయవంచన.. పదేండ్లలో మోసం..వందేండ్ల విధ్వంసం అంటూ రాశారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ.. విదేశాల్లో నల్లధనం తీసుకొచ్చి వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడా?...పదేండ్లలో లక్షల రైతుల ఆత్మహత్యలు, మళ్లొస్తే పెట్రోల్ రేట్లు లీటర్ రూ. 420 కావడం పక్కా అని రాశారు . పదేండ్లలో కన్నీళ్ల పాలనను యాదుంచుకుందాం..ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..అంటూ ఫ్లెక్సీలో రాశారు.