తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే ఐదు గంటల పాటు విమానాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఈ విషయాన్ని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (TIAL) బుధవారం వెల్లడించింది.
శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి బయలుదేరే పెంకుని ఆరట్టు ఊరేగింపు ఎయిర్పోర్ట్ గుండా వెళుతుందని, ఈ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఐదు గంటల పాటు విమాన సర్వీసును నిలిపివేయాలని నిర్ణయించినట్లు TIAL తెలిపింది. ఏడాదికి రెండు సార్లు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా జరుగుతుంది.
సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆలయ దేవతల ఊరేగింపు ఈ విమానాశ్రయం గుండా జరుగుతున్నాయి. ఊరేగింపులో భాగంగా విమానాశ్రయం వెనకాల ఉన్న సముద్రంలో విగ్రహాల ఉత్సవ స్నానం తరువాత సాంప్రదాయ జ్యోతుల ద్వారా వెలిగించిన ఊరేగింపులో విగ్రహాలను తిరిగి మందిరానికి తీసుకువెళతారు.