ఉధృతంగా మూసీ..ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఉధృతంగా మూసీ..ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1787 అడుగుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోసారి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నార్సింగి నుండి మంచిరేవులకు వెళ్లే దారిగుండా ప్రయాణించొద్దని సూచించారు. 

కాగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం  తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా వికారాబాద్ లో 12.9 సెంటిమీటర్ల వర్షం పడింది.