
- రోడ్లన్నీ జలమయం
- తడిసిన వడ్లు, పొగాకు
- రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం కూడా వర్షం దంచికొట్టింది. ఆర్మూర్, బాల్కొండ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. త్వరగా కాంటాలు వేయడం లేదని ఆర్మూర్లో రైతులు రాస్తారోకో చేశారు. ఆర్డీవో రాజాగౌడ్ వచ్చి తడిసిన వడ్లను కొనేలా మిల్లర్లను ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. బోధన్ డివిజన్లో వర్షం పొగాకు రైతులను ఆగం చేసింది. అమ్మకాలకు సిద్ధం చేసిన పొగాకు తడిసిపోయింది.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. అశోక్నగర్ కాలనీ రోడ్డు, స్టేషన్ రోడ్డు, విద్యానగర్ కాలనీ, నిజాంసాగర్ రోడ్డు, పాత బస్టాండు, జేపీఎన్ రోడ్డులో వదర నీరు రోడ్డుపై ప్రవహించింది. బుధవారం రాత్రి, గురువారం కామారెడ్డి, బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, పిట్లం, భిక్కనూరు, పాల్వంచ, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, డొంగ్లి, తాడ్వాయి, ఎల్లారెడ్డి, పెద్దకొడప్గల్, లింగంపేట, రాజంపేట మండలాల్లో వర్షం పడింది. బీర్కుర్ మండలం నుంచి వెంకటప్పయ్య క్యాంపునకు వెళ్లే రోడ్డుపై చెట్లు విరిగి పడి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.