- దిగుమతులు తగ్గించేందుకే పామాయిల్ ప్రొడక్షన్
- 28 లక్షల టన్నులకు పెంచాలని టార్గెట్
న్యూఢిల్లీ: దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే టార్గెట్తో రూ. 11,040 కోట్లతో వంట నూనెల (ఎడిబుల్ ఆయిల్) కోసం నేషనల్ మిషన్ను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా పామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచేందుకు ఈ మిషన్ కింద చొరవ తీసుకోనున్నారు. ఈ నేషనల్ మిషన్ ప్రపోజల్కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు (నార్త్ ఈస్టర్న్ స్టేట్స్), అండమాన్, నికోబార్ దీవులపై ఈ మిషన్ ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. వంట నూనెల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తున్న నేపథ్యంలో ఈ నేషనల్ మిషన్ను తెస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశీయంగా వంట నూనెల సాగును, దిగుబడిని పెంచాలనేదే ఈ మిషన్ టార్గెట్ అని కేబినెట్ సెక్రటేరియట్ ఒక స్టేట్మెంట్లో వివరించింది.
కేంద్రం రూ. 8,844 కోట్లు...
కొత్త స్కీము కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,844 కోట్లను సమకూర్చనుండగా, రాష్ట్రాలు మిగిలిన రూ. 2,196 కోట్లను సమకూర్చ వలసి ఉంటుంది. 2026 నాటికి దేశంలో ఆయిల్ పామ్ సాగును మరో 6.5 లక్షల హెక్టార్లు పెంచాలని, దీంతో 10 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా దేశంలో క్రూడ్ పామాయిల్ (సీపీఓ) ప్రొడక్షన్ 2026 నాటికి 11.20 లక్షల టన్నులకు, ఆ తర్వాత 2030 నాటికి 28 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ఆయిల్ పామ్ రైతులకు ప్రధానంగా ఈ స్కీము ఉపయోగపడనుంది. ఆయిల్ పామ్ సాగులో పెట్టుబడులు పెంచడంతోపాటు, ఉద్యోగావకాశాలనూ కల్పిస్తుందని, అన్నింటికీ మించి దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తుందని ప్రభుత్వం ఈ స్టేట్మెంట్లో పేర్కొంది. ఆయిల్ పామ్ రైతులు ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ (ఎఫ్ఎఫ్బీ) ఉత్పత్తి చేస్తారు. వీటి నుంచే పామాయిల్ను తయారు చేస్తారు.