జనాభా లెక్కలకు పోనంటే జైలే

జనాభా లెక్కలకు పోనంటే జైలే

న్యూఢిల్లీ: జనాభా లెక్కలకు రంగం సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాలూ ఏర్పాట్లలో మునిగిపోయాయి. సర్వేకు వెళ్లే స్టాఫ్‌‌కు ట్రైనింగ్‌‌కు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే.. ఒకవేళ ఏదైనా రాష్ట్రం ‘మేం సర్వే చేయించం’ అంటే? ఎవరైనా గవర్నమెంట్‌‌ ఉద్యోగే ‘నేను సర్వే చేయడానికి పోను’ అంటే? సెన్సస్ ఆఫ్‌‌ ఇండియా యాక్టు ప్రకారం గట్టి శిక్షలే ఉన్నాయి. ప్రభుత్వం గాని, ఉద్యోగి గాని సర్వేకు సాయం చేయకపోతే యాక్టులోని సెక్షన్‌‌ 11 ప్రకారం జైలు శిక్ష గాని, ఫైన్‌‌గానీ వేసే అధికారం కేంద్రానికి ఉందని అధికారులు చెప్పారు. అట్లాగే ఎన్పీఆర్‌‌ డ్యూటీ చేయడానికి నిరాకరిస్తే సిటిజన్‌‌షిప్‌‌ రూల్స్‌‌ 2003 ప్రకారం రూ. వెయ్యి వరకు ఫైన్‌‌ వేయొచ్చన్నారు.

పైగా ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే చాన్స్‌‌ ఉందని చెప్పారు. సెన్సస్‌‌ ఆఫ్‌‌ ఇండియా యాక్టు, సిటిజన్‌‌షిప్‌‌ రూల్స్‌‌ ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలు జనగణన చేయడంలో సెన్సస్‌‌ కమిషనర్‌‌ అండ్‌‌ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సిటిజన్‌‌ రిజిస్ట్రేషన్‌‌కు సహకరించాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, యూటీలు ప్రిన్సిపల్‌‌ సెన్సస్‌‌ అధికారిని, జిల్లా, ప్రాంతాల వారీగా సెన్సస్‌‌ అధికారులను, సూపర్‌‌వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సిటిజన్‌‌ రిజిస్ట్రేషన్‌‌కు సహకరించాలన్నారు. 2021 జనగణనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి సెప్టెంబర్‌‌ వరకు జనాభా లెక్కలు తీయనున్నారు. ఇందుకోసం టీచర్లు, ఇతర గవర్నమెంట్‌‌ స్టాఫ్‌‌ను ఎన్యుమరేటర్లుగా నియమించారు.