కమలాపూర్(ఎల్కతుర్తి), వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీశ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ‘ఊరి కోసం.. ఒక్కరోజు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మురుగుకాల్వలు, రోడ్లను శుభ్రం చేశారు. సర్పంచ్ పబ్బు సతీశ్ మాట్లాడుతూ.. మండల కేంద్రం కావడంతో పారిశుధ్య సిబ్బంది కొరత సవాల్గా మారిందన్నారు. .
అందుకే గ్రామస్థులు, పంచాయతీ సభ్యులంతా వారంలో ఒక రోజు శ్రమదానం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా నెలలో ఒక రోజు శ్రమదానంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కమలాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
