
- గత ఏడాది కాలంలో భారీగా దానాలు చేసినవారి లిస్ట్ను బయటపెట్టిన ఫోర్బ్స్
- ఇండియా నుంచి డీఎల్ఎఫ్ కేపీ సింగ్,
- ఇన్ఫోసిస్ నందన్ నిలేకని,జెరోధా నిఖిల్ కామత్కు చోటు
బిజినెస్ డెస్క్, వెలుగు : ఆసియా– పసిఫిక్ దేశాల్లో ఎక్కువగా దానాలు చేస్తున్న సంపన్నుల జాబితాలో మనవారికి చోటు దక్కింది. డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేకని, జెరోధా కో– ఫౌండర్ నిఖిల్ కామత్ గత ఏడాది కాలంలో ఎక్కువగా దానాలు చేసిన ఇండియన్లలో టాప్లో ఉన్నారు. కేపీ సింగ్ (92) డీఎల్ఎఫ్లోని తన వాటాలను అమ్మి 89 మిలియన్ డాలర్లు సేకరించారని, ఈ ఫండ్స్ను కేపీ సింగ్ ఫౌండేషన్కు దానం చేశారని ఫోర్బ్స్ వెల్లడించింది. కేపీ సింగ్ సంపద 14 బిలియన్ డాలర్లు ఉంటుందని ఈ సంస్థ అంచనావేసింది. ఆయన నాయకత్వంలోనే డీఎల్ఎఫ్ అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ఎదిగింది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ నందన్ నిలేకని గత ఏడాది కాలంలో 38 మిలియన్ డాలర్లను ఐఐటీ బాంబేకి దానం చేశారు. 1999 తర్వాత నుంచి చూస్తే ఆయన ఏకంగా రూ. 400 కోట్లు దానం చేశారని ఫోర్బ్స్ తన 17 వ యాన్యువల్ ఫిలాంత్రపిస్ట్స్ రిపోర్ట్లో పేర్కొంది. ఏక్స్టెప్ ఫౌండేషన్, ఏఐ4భారత్ వంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లకు కూడా ఆయన భారీగానే దానం చేశారని వెల్లడించింది. నందన్ నిలేకని సంపద 2.9 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి 2017 లో గివింగ్ ప్లెడ్జ్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యారు. ఇందులో జాయిన్ అయిన మెంబర్లు తమ సంపదలో మెజార్టీ వాటాను దానాలు చేస్తామని
ప్రతిజ్ఞ చేస్తారు. బ్రోకరేజ్ కంపెనీ జెరోధా కో–ఫౌండర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిఖిల్ కామత్ ఈ ఏడాది జూన్లో గివింగ్ ప్లెడ్జ్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యారు. ఇందులో జాయిన్ అయిన నాలుగో ఇండియన్గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. విప్రో బాస్ అజిమ్ ప్రేమ్జీ (2013), బయోకాన్ కిరణ్ మజుందర్ షా (2016), నందన్ నిలేకని, రోహిణి (2017) ఇందులో జాయిన్ అయ్యారు. క్లయిమేట్ చేంజ్ సమస్యలను పరిష్కరించడానికి నిఖిల్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఎనర్జీ వాడకంపై అవగాహన కల్పించడం, అందరికీ సమానంగా వైద్యం అందడం వంటి అంశాలపై ఆయన ఫోకస్ పెట్టారంది. గివింగ్ ప్లెడ్జ్ లిస్ట్లో యంగెస్ట్ బిలియనీర్గా కామత్ (37) ఉన్నారు. నిఖిల్ కామత్ సంపద 1.1 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ అంచనావేస్తోంది. తన యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ‘డబ్ల్యూటీఎఫ్’ ద్వారా , తన ఆడియెన్స్ ఎంచుకున్న ఛారిటీస్కు 1,20,000 డాలర్ల వరకు దానం చేస్తున్నారు. తన దానాలను రూ. 4 కోట్ల వరకు పెంచాలని ఆయన చూస్తున్నారు.
మిగిలిన సంపన్నుల దానాలు..
ఫోర్బ్స్ ఫిలాంత్రపీ లిస్ట్లో ఆసియా పసిఫిక్ దేశాల నుంచి కియెన్స్ ఫౌండర్ టకెమిట్సు టకిజాకి (జపాన్) టాప్లో ఉన్నారు. ఆయన గత ఏడాది కాలంలో 2.6 బిలియన్ డాలర్లను తన ఫౌండేషన్లకు దానం చేశారు. ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ ఆండ్రూ ఫారెస్ట్, ఆయన భార్య నికోలా ఫారెస్ట్ (ఆస్ట్రేలియా) తమ మిండెరూ ఫౌండేషన్కు 3.3 బిలియన్ డాలర్లు దానం చేశారు. మిడియా గ్రూప్ ఫౌండర్ హీ జింగ్జియన్ హో (చైనా) 410 మిలియన్ డాలర్లను చైనాలో సైంటిఫిక్ రీసెర్చ్కు దానం చేశారు. హాంగ్కాంగ్ లీ కా షింగ్ మెడికల్ ట్రెయినింగ్లో ఏఐని డెవలప్ చేయడానికి 7.7 మిలియన్ డాలర్లు దానం చేశారు. ఇండోనేషియా బిలియనీర్ లో టక్ క్వాంగ్ 73 మిలియన్ డాలర్లను లీ కౌన్ యే స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి దానం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా ఈ ఫండ్స్ ఇచ్చారు.