
- బార్డర్లో ఎలాంటి సవాల్ ఎదురైనా తిప్పికొడతామని వెల్లడి
- పెట్రోలు, డీజిల్ కొనుగోలుపై ఏ దేశమూ ఆర్డర్ వేయలేదని వ్యాఖ్య
కంపాలా(ఉగాండా): విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇప్పటి ఇండియా చాలా డిఫరెంట్. దశాబ్దాలుగా భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. చైనా, పాక్ల నుంచి ఎలాంటి సవాల్ ఎదురైనా తిప్పికొట్టేందుకు మేం సిద్ధం” అని చెప్పారు. బుధవారం ఉగాండా రాజధాని కంపాలాలో ప్రవాస భారతీయులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు.
“అది యూరీ అయినా.. బాలాకోట్ అయినా.. తాడోపేడో తేల్చుకునే సత్తా నేటి భారత్కు ఉంది” అని ఆయన చెప్పారు. ‘‘మూడేళ్లుగా చైనా వరుసగా ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడుతోంది. పెద్దసంఖ్యలో ఆర్మీని మన బార్డర్లో మోహరిస్తోంది. మేం దానిపై ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టాం. అక్కడ మరింత పని జరగాల్సి ఉంది” అని వివరించారు. ‘‘ఇప్పుడు ఇండియాను ఏ దేశం కూడా ఒత్తిడి చేయలేదు. పెట్రోలు, డీజిల్ ఎక్కడ కొనాలి? అనేది మనకు ఎవరూ చెప్పలేరు. దేశ పౌరుల ప్రయోజనాల కోణంలోనే మేం పనిచేస్తాం” అని జైశంకర్ తేల్చిచెప్పారు.