ధరణిలో కనిపించని పట్టాదారు ఖాతా, సర్వే నంబర్లు
సూర్యాపేట జిల్లాలో భూ బాగోతం
ఎంపీటీసీ ఫిర్యాదుతో ఆఫీసర్ల ఎంక్వైరీ
సూర్యాపేట, వెలుగు: దొంగ పాస్బుక్లతో అక్రమార్కులు దర్జాగా ఫారెస్ట్ భూమిని అమ్మకానికి పెట్టారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లు ఉపయోగించి బై నంబర్లతో 500 ఎకరాలకు ఫేక్ పాస్బుక్లు సృష్టించారు. ఒరిజినల్ పాస్ బుక్లకు తీసిపోకుండా ఉన్న వీటిని చూసి ఆఫీసర్లు సైతం అవాక్కయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ డివిజన్ చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామ సర్వే నంబర్318లో సుమారు 1,393 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఈ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అటవీశాఖ ఆధీనంలో ఈ భూమి ఉండగా.. ధరణి పోర్టల్లో సర్వే నంబర్318/ఆ1లో 1,389.36 ఎకరాలు గల్లా శ్రీనివాసరావు పేరుతో నమోదైంది. ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు బౌండరీ వివాదంతో కోర్టుకెక్కడంతో ఆఫీసర్లు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంచారు.
30 మంది పేర్లతో..
ధరణితో దొంగ పాస్ బుక్లు పుట్టుకొచ్చే అవకాశమే లేదని, పాస్పోర్టు కంటే హై సెక్యూరిటీ ఫీచర్స్తో పాస్బుక్లను తయారు చేశామని సర్కారు చెబుతోంది. కానీ ఓవైపు సర్వే నంబర్ 318 భూముల వివాదం కోర్టులో ఉండగానే 30 మంది పేర్లతో 500 ఎకరాలకు బై నంబర్లతో ఫేక్ పాస్బుక్లు సృష్టించారు. ఆ 30 మంది వివరాలు ధరణి పోర్టల్లో లేవు. గ్రామస్తులకు సైతం వారి పేరుతో పాస్బుక్లు ఉన్నట్లు తెలియదు. పట్టాదారు పాసుబుక్పై వ్యక్తుల వివరాలు, ఫొటోతోపాటు ఆధార్ నంబర్ కూడా ఉంది. గత ఏడాది 2 ఫిబ్రవరి, జులై 2న పాస్బుక్లు జారీ అయినట్లు ఉండగా వాటిపై స్థానిక తహసీల్దార్ సంతకం కూడా ఉంది. ఇదిలా ఉంటే ధరణిలో నమోదైన వివరాల ఆధారంగా ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను ప్రింట్ చేసి అందిస్తుంది. కానీ ఆన్లైన్లో వివరాలు లేకుండానే పాసుబుక్లు ఎలా వచ్చాయో అంతుచిక్కడం లేదు. ఫేక్ పాస్బుక్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ భూములను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ తంతంగం వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపీటీసీ ఫిర్యాదుతో కదలిన డొంక
పాస్బుక్ఫొటో, వివరాలను వాట్సప్లో పెట్టి భూముల అమ్మకానికి ప్రయత్నించారు. చింతలపాలెం మండలం తమ్మారం ఎంపీటీసీ సైదమ్మ, ఆమె భర్త మోహన్రెడ్డి పేరుతో 15 ఎకరాల చొప్పున 30 ఎకరాలకు ఫేక్ పాస్బుక్లు పుట్టించారు. ఆ పాస్బుక్లు ఎంపీటీసీ దృష్టికి వచ్చాయి. వారికి ఆ సర్వే నంబర్లో ఎలాంటి భూమి లేకపోవడం, మిగతా వివరాలన్నీ సరిగ్గా ఉండడంతో తమ పేరుతో దొంగ పాస్బుక్లు సృష్టించినట్లు గుర్తించారు. దీంతో స్థానిక తహసీల్దార్కు సమాచారం ఇవ్వగా విషయం బయటపడింది. పలువురికి వాట్సప్లో వచ్చిన పాస్బుక్వివరాలను ధరణిలో చెక్చేయగా కనిపించలేదు. దీంతో అవన్నీ నకిలీవిగా గుర్తించారు.
ఎంక్వైరీ చేస్తున్నం
318 సర్వే నంబర్ లో ఉన్న భూములు వివాదంలో ఉండడంతో ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాం. 318లో ఎవరికీ పట్టా పాస్ బుక్లు జారీ చేయలేదు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నం.
– మోహన్రావు, అడిషనల్ కలెక్టర్, సూర్యాపేట