తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లాలోని సహజ సిద్ధ ప్రకృతి అందాలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. బుధవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ పరిధిలోని తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన ఆరు హట్స్, 18 కిలోమీటర్లు మేర సఫారీ చేయడానికి రెండు వాహనాలను ప్రారంభించామని చెప్పారు.
రామప్ప సరస్సు మధ్య గల ద్వీపాన్ని అభివృద్ధి చేయడంతో పాటు త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరను సక్సెస్ చేయాలని కోరారు. పస్రా, తాడ్వాయి జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ను పునఃప్రారంభించామని, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు నైట్ క్యాంప్ విడిది కేంద్రాలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు.
అనంతరం మేడారంలో నార్లాపూర్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. తర్వాత మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ బట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, సర్పంచ్ భారతీ వెంకన్న పాల్గొన్నారు.
