
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను రైల్రోకోకు పిలుపునివ్వలేదని.. ఆధారాలు లేకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్దాఖలు చేశారు. కేవలం మౌఖికంగా ఇచ్చిన కొన్ని వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. మల్కాజ్గిరి పోలీసుల నివేదిక ప్రకారం.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో రైల్రోకో చేపట్టాలంటూ కేసీఆర్, పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం ఇచ్చిన పిలుపు మేరకు.. తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత, ఆమె అనుచరులు 40 మంది రైలుపట్టాలపై కూర్చుని రైలు రాకపోకలకు అంతరాయం కలిగించడంతోపాటు, రైల్వే ఉద్యోగుల విధులకు అంటంకం కలిగించారని కేసు నమోదైంది.
అందులో కవితతోపాటు మరో 14 మందిని అదుపులోకి తీసుకుని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. మిగిలినవారంతా పరారయ్యారు. అయితే, ఈ కేసులో తనతోపాటు మరొకరిని పరారీలో చూపుతూ కేసును విడగొట్టారని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2023లో ప్రజాప్రతినిధుల కోర్టు అభియోగ పత్రానికి నంబరు కేటాయించి కేసు విచారణ చేపట్టిందన్నారు. రైల్రోకోకు తానెలాంటి పిలుపునివ్వలేదని తెలిపారు. రైల్రోకోలో పాల్గొన్నవారిని అరెస్ట్ చేయడం వారిని కోర్టులో హాజరుపరచడం, షరతులతో వారిని వదిలిపెట్టడం అన్నీ జరిగిపోయాయన్నారు. అందువల్ల కింది కోర్టు నుంచి రికార్డులను తెప్పించి పరిశీలించి తనపై కేసును కొట్టివేయాలని కేసీఆర్ కోరారు.