- తెలుగు భాషను కాపాడుకుందాం
- మొదటి ఐదేండ్లు మాతృభాషలోనే చదవాలి
- మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
ఖైరతాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరు మొదటి ఐదేండ్లు మాతృభాషలోనే చదవాలని, దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోవాలని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. తొలి ఐదేండ్లు మాతృభాషలో చదివిన వాళ్లే మేధావులు అయ్యారన్నారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేయకుండా, రెండు రాష్ట్రాలు 5వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే అంతర్జాతీయ తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అక్షరయాన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు భాషను, కవులను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో ఒక పీఠం ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రాంతాలకు తెలుగు భాషను విస్తరించేందుకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయాల్లో తిట్లు సరికాదని, ఇవి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడులో వారి భాషపై మమకారం ఎక్కువ ఉంటుందని, తెలుగు రాష్ట్రాలో ఆ పరిస్థితి లేదని రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఎడిటర్ కె. శ్రీనివాస్ తో పాటు కవులను సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ తంగెడ కిషన్ రావు, అక్షరయాన్ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పదాలతో డిక్షనరీ రావాలె: జూలూరు గౌరీశంకర్
సికింద్రాబాద్: తెలంగాణ పదాలతో డిక్షనరీ రావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్ మెంట్ హెచ్వోడీ ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనం వాడుతున్న పదాలను సేకరించాలన్నారు. యూనివర్సిటీ రీసెర్చ్ల కోసం సాహిత్య అకాడమీ సహకారం ఉంటుందని భరోసానిచ్చారు