హైదరాబాద్, వెలుగు: గుజరాత్ మాజీ సీఎం శంకర్సింగ్ వాఘేలా శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. 5 గంటల పాటు వీరిద్దరు జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చించారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు తేవడానికి కృషి చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు. వాఘేలా లాంటి సీనియర్ నాయకుడు తన నాయకత్వాన్ని సమర్థించడంపై కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టడానికి తనలాంటి సీనియర్ నేతలందరి మద్దతు కేసీఆర్కు ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. మోడీ రాజకీయాలపై దేశమంతటా వ్యతిరేకత వస్తోందని, ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామిక వాదుల మౌనం మంచిదికాదని వాఘేలా అన్నట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
ముందుండి నడిపించే లీడర్ కావాలె
కేంద్రంలో నియంతృత్వం పెరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముందుండి నడిపించే నాయకత్వం లేక ఆందోళనతో ఉన్నామని వాఘేలా చెప్పారు. ఈ సందర్భంలో చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ కేంద్రం విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు తమలాంటి వారిని ప్రభావితం చేస్తోందన్నారు. అనుకున్నది సాధించేదాకా పట్టువిడవని నాయకుడిగా కేసీఆర్ను దేశం ఇప్పటికే గుర్తించిందని చెప్పారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించడం దేశ చరిత్రలోనే గొప్ప విషయమని, తక్కువ టైంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారని కొనియాడారు. 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి ఘన చరిత్ర కేసీఆర్ది మాత్రమేనని వాఘేలా చెప్పారని ప్రెస్నోట్లో వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లొంగదీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. ఇలాంటి నియంతృత్వం నుంచి తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఉంటుందనుకున్న కాంగ్రెస్ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అందరినీ కలుపుకొని పోయే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, పలువురు సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే వారి అభిప్రాయాన్ని చెప్పడానికి తాను హైదరాబాద్కు వచ్చానని అన్నారు. తామందరి సపోర్ట్ ఔట్రైట్గా కేసీఆర్కు ఉంటుందని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశగతిని మార్చాలని కోరుతున్నామని వాఘేలా సీఎం కేసీఆర్తో అన్నారని ప్రెస్నోట్లో వెల్లడించారు.