కాళేశ్వరంపై దుష్ప్రచారం..రెండు పిల్లర్లే కుంగినయ్: హరీశ్ రావు

కాళేశ్వరంపై దుష్ప్రచారం..రెండు పిల్లర్లే కుంగినయ్: హరీశ్ రావు
  • మేడిగడ్డలోని 85 పిల్లర్లలో రెండు పిల్లర్లే కుంగినయ్.. 
  • దానికే బ్యారేజీ మొత్తం కూలిందంటున్నరు: హరీశ్​రావు
  • కావాలనే రేవంత్​ సర్కార్​రిపేర్లు చేస్తలేదు.. గోబెల్స్​కు తాతలా ఉత్తమ్​ మారిపోయిండు
  • కమిషన్​ ముందు విచారణకు హాజరవుతం.. మాకేం భయం
  • కాళేశ్వరంతో నేరుగా 98,570 ఎకరాలకు నీళ్లు
  • తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ఎంతో శ్రమించారు
  • రాజకీయ ప్రయోజనాల కోసం నాడు మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్​ పార్టీ రాజకీయం చేస్తున్నదని.. కావాలనే తప్పుడు ప్రచారానికి దిగిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ‘‘బీఆర్​ఎస్​కు రాజకీయంగా లాభం చేకూరుతుందనే కాంగ్రెస్​ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నరు. మొదటి నుంచీ కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నరు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లుంటే.. కుంగింది రెండు పిల్లర్లే. మిగతా బ్లాకులన్నీ చెక్కు చెదరలేదు. కానీ, బ్యారేజీ మొత్తం కూలిందన్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు, నేతలు పదే పదే మాట్లాడుతున్నరు” అని ఆయన దుయ్యబట్టారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను బ్లాకుల్లాగా నిర్మించామని.. మేడిగడ్డలో ఒక్క బ్లాక్​ మాత్రమే దెబ్బతిన్నదని తెలిపారు.


దానిని తీసేసి కొత్తగా కట్టుకోవచ్చని హరీశ్​రావు​ పేర్కొన్నారు. ‘‘మిగతా బ్యారేజీల్లాగా ఒకటే స్ట్రక్చర్​లాగా దాన్ని నిర్మించలేదు. ఆ ఒక్క బ్లాక్​ను కొత్తగా కడితే బ్యారేజీ పటిష్ఠంగా ఉంటుంది” అని తెలిపారు.కాళేశ్వరం సిస్టమ్​లోని మిగతా అన్ని కాంపొనెంట్లు చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు.. దుష్ప్రచారాలు’’ పేరుతో శనివారం తెలంగాణ భవన్​లో హరీశ్ ​రావు పవర్​ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తూ మేడిగడ్డకు రిపేర్లు కూడా చేయడం లేదని అన్నారు. ‘‘ప్రభుత్వం భేషజాలకు పోకుండా రిపేర్లు చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం కల్పతరువుగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణకు తప్పకుండా వెళ్తాం. మేమేం భయపడట్లేదు. ప్రాణ త్యాగాలకే సిద్ధపడిన నాయకులం.. కాంగ్రెస్​ చేసే చిల్లర తాటాకు చప్పుళ్లకు భయపడం. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన గోబెల్స్​ ప్రచారాలను పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం కమిషన్​ ముందు పెడతాం’’ అని ఆయన తెలిపారు. 

తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవ్​

తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని సెంట్రల్ వాటర్​ కమిషన్ చెబితేనే సైట్​ను మేడిగడ్డకు మార్చామని హరీశ్ రావు అన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహి త–చేవెళ్ల ప్రాజెక్టు కోసం నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రిగా నేను ఎంతగానో ప్రయత్నించాం. కేసీఆర్​ తన పుట్టినరోజు నాడే (2015 ఫిబ్రవరి 17) నాడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో భేటీ అయ్యారు. అప్పుడు మహారాష్ట్రకు తెలంగాణ బిడ్డ సీహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్​గా ఉన్నారు. ఫడ్నవీస్​ను కేసీఆర్ ఎంతో రిక్వెస్ట్ చేశారు. కానీ, అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లు ఒప్పుకోలేదు. 148 మీటర్లకే ఓకే చెప్పారు. ఆ ఎత్తుతో వచ్చే నీళ్లు సరిపోవని.. వేరే ప్రాంతాలపై అధ్యయనం చేయించారు. వ్యాప్కోస్​ సంస్థ అధ్యయనం చేశాకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మిం చాం” అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2007 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఒక్క అనుమతి కూడా తీసుకోలేదని అన్నారు. ‘‘పైగా బ్యారేజీ హెడ్​ వర్క్స్ చేయకుండా.. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేప ట్టారు. 2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమే. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రూప కల్పన చేసింది. 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.2,328 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా పనులు జరగనే లేదు. తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా అడ్వాన్సుల పేరిట కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.1,052 కోట్లు మిం గిందని కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఆ పైసల ను కాంగ్రెస్​ నేతలు జేబులు నింపుకున్నారు. అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులే. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నడు. అది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అని విమర్శలూ గుప్పించారు. కానీ, నేడు అదే రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ అవినీతిని వెనకేసుకొస్తున్నడు. ప్రాణహిత – చేవెళ్ల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినం.. ఇంకో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తి అవుతుండేనని ఈ మధ్య ఉత్తమ్​కుమార్​ రెడ్డి కూడా అన్నారు. కానీ, లెక్కలన్నీ తీస్తే తుమ్మిడిహెట్టి కోసం నాటి కాంగ్రెస్​ ఖర్చు పెట్టింది కేవలం రూ.3,700 కోట్లే. గోబెల్స్​కు ఉత్తమ్​ తాతలా మారిపోయారు’’ అని హరీశ్​ రావు విమర్శించారు.  

కాళేశ్వరంతో పంటలే పండలేదా..?

కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలు పండనట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని హరీశ్​ అన్నారు. నేరుగా ఒక్క కాళేశ్వరం బ్యారేజీలతోనే 98,570 ఎకరాలకు నీళ్లొచ్చాయని తెలిపారు. మొత్తంగా కాళేశ్వరం సిస్టమ్​తో 20,33,572 ఎకరాల్లో పంటలు పండాయన్నారు. మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్​, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. మూడు సోర్సుల ద్వారా నీటిని తెచ్చుకునేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. ‘‘వర్షాలు మంచిగా పడితే నేరుగా శ్రీరాంసాగర్​ నుంచి మిడ్​మానేరుకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించొచ్చు. సాధారణ వర్షపాతం నమోదైతే ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరుకు తీసుకురావొచ్చు. కరువు కాలంలో మేడిగడ్డ నుంచి నీటిని మిడ్​మానేరుకు తరలించుకోవచ్చు. మేడిగడ్డ వద్ద కరువు కాలంలోనూ నీళ్లుంటాయి. మిడ్​మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్​, మల్లన్నసాగర్​, కొండపోచమ్మ సాగర్​ వరకు నీళ్లు తీసుకొచ్చాం. ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా?! ఆ వ్యవస్థ పనిచేయడం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు పండాయి. ఒక ఏడాది కరువు వస్తే.. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు కూడా నీటిని రివర్స్​ పంపింగ్​ చేశాం. కాళేశ్వరం నీళ్లు పంపి పంటలను కాపాడింది కేసీఆర్​ ప్రభుత్వం. ఇది నీటిపారుదల శాఖ అధికారులు ఇస్తున్న రిపోర్ట్​’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఇంజనీరింగ్​ మార్వెల్​ అని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్​ చెప్పారని హరీశ్​ అన్నారు. గత నాలుగేండ్లు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇబ్బంది రాలేదని, మిడ్​మానేరును ఆపరేట్​ చేసి నీళ్లిచ్చుకున్నామని చెప్పారు. 

తుమ్మలను కూడా విచారణకు పిలవాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్​ అనడం సరి కాదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్​ ముందు ఈటల రాజేందర్​ ఇచ్చిన స్టేట్​మెంట్​పై శనివారం తెలంగాణ భవన్​లో మీడియా చిట్​చాట్​లో హరీశ్​ రావు స్పందించారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదన్నారు. ఈటల రాజేందర్​కు కొన్ని అంశాలు గుర్తుండకపోవచ్చని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేబినెట్​ సబ్​ కమిటీ నిర్ణయాలపై ఈటల, తుమ్మల నాగేశ్వర్​ రావు కూడా సంతకాలు చేశారని చెప్పారు. అలాంటప్పుడు తుమ్మల నాగేశ్వర్​ రావును కూడా విచారణకు పిలవాలి కదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్​ సబ్​ కమిటీలో తాను, తుమ్మల, ఈటల ఉన్నామని హరీశ్​ తెలిపారు. కాగా, కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న అప్పులు,  బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టంపైనా త్వరలోనే పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇస్తానని చెప్పారు. ‘‘బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిన రేవంత్​ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యిండు” అని ఆయన దుయ్యబట్టారు.