హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారన్న భయంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ కుట్రలో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
దేశంలో కేసీఆర్, కేజ్రీవాల్ మాత్రమే బీజేపీకి వణుకు పుట్టించారని, అందుకే వాళ్లను బంధించి ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రచేసిందన్నారు. ఆ కుట్రలో భాగంగానే లిక్కర్ కేసును సృష్టించారన్నారు. ఇక రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతులు అప్పులు చేసి సాగు చేశారని, పంట చేతికి వచ్చే టైమ్ లో నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కర్నాటకలోని ఆల్మట్టిలో నీళ్లు ఉన్నాయని, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి కనీసం ఓ పది టీఎంసీ నీళ్లు రైతులకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.