నాగర్కర్నూల్, వెలుగు: నాతోనే తెలంగాణ వచ్చిందంటడు.. తెలంగాణకు ముందు, తర్వాత నేనే అంటడు.. సావును ముద్దాడిన అంటడు. ఇంకా ఏమేం అంటడో అని సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి డా.నాగం జనార్దన్రెడ్డి ఫైర్ అయ్యారు. 1969లో ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ లాగులు కూడా సరిగ్గా కట్టలేదేమోనని ఎద్దేవా చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ మాటల తీరుపై తీవ్రంగా స్పందించారు.
సకల జనులు ఏకమై పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్కు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేవన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పాడె కడితే భయపడి నిమ్స్లో ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఉద్యమం చేసిండని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి అగ్నికి ఆహూతి అయితే, హరీశ్రావుకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదని విమర్శించారు. కేసీఆర్ ఉద్యమం అంతా ఎలక్షన్లలో పొత్తులు పెట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడమేనన్నారు. 1969లో ప్రాణాలు కోల్పోయిన 360 మంది అమర వీరుల కుటుంబాలను గుర్తించి వారిని గౌరవించాలన్న సంస్కారం కూడా లేదన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదులలో బీహెచ్ఈఎల్ కంపెనీ 9 పంపులకు రూ.803 కోట్లు చార్జీ చేస్తే, ప్రభుత్వం మాత్రం మెగా కంపెనీకి రూ.2,436 కోట్లు ఇచ్చిందన్నారు. ఏపీ సర్కార్ కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్ట్కు ప్రగతిభవన్లో డిజైన్ చేసిన కేసీఆర్ దక్షిణ తెలంగాణ మీద కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.