అట్ల పోయి ఇట్ల వచ్చిండు .. గులాబీ గూటికే చేరిన తాటికొండ రాజయ్య

అట్ల పోయి ఇట్ల వచ్చిండు .. గులాబీ గూటికే చేరిన తాటికొండ రాజయ్య
  • కండువా కప్పని కేసీఆర్​
  • పార్టీలో ఉన్నట్టేనని స్పష్టం 

జనగామ, వెలుగు : స్టేషన్​ఘన్​పూర్​ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అటూ ఇటూ తిరిగి చివరకు గులాబీ గూటికే చేరారు. రెండు నెలల క్రితం ఆత్మాభిమానం చంపుకోలేక అంటూ కేసీఆర్, ఇతర లీడర్లపై​విరుచుకుపడిన ఆయన బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. మళ్లీ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో కేసీఆర్ ​చెంతకే చేరారు. ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాం హౌస్​లో కేసీఆర్​తో భేటీ కాగా రాజయ్యకు కనీసం పార్టీ కండువా కూడా కప్పలేదు. అప్పటి రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి పార్టీలో ఉన్నట్లే అని కేసీఆర్​ చెప్పారు. 

అలాగే స్టేషన్ ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ బాధ్యతలను రాజయ్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించుకోవాలని కేసీఆర్​ సూచించినట్టు సమాచారం. దీంతో ముభావంగానే రాజయ్య తలూపి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు స్టేషన్​ఘన్​పూర్ ​టికెట్​రాకపోవడంతో నిరాశ చెందారు. కాంగ్రెస్​లో చేరి వరంగల్​ఎంపీ అవుదామని ఆశించారు.

 కానీ, కాంగ్రెస్​ నుంచి ఎటువంటి హామీ తీసుకోకముందే గులాబీ గూటికి గుడ్​ బై చెప్పారు. పలుమార్లు ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతో పాటు, రాష్ట్ర పార్టీ ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ, సీఎం రేవంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులను కలిసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో రాజయ్య చిరకాల ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి కూతురు కావ్యకు పిలిచి మరీ కాంగ్రెస్​ టికెట్​ ఇచ్చింది. ఈ పరిణామాలు రాజయ్యకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు తిరిగి గులాబీ గూటికి చేరి ఎంపీ టికెట్​ తెచ్చుకుందామని అనుకుంటే అధినేత కేసీఆర్ ...సుధీర్​కుమార్​కు  కన్ఫం చేసి రాజయ్య ఆశలపై నీళ్లు చల్లారు. 

రెండు రోజుల క్రితం అభ్యర్థిత్వం ఫైనల్​ చేసే క్రమంలో రాజయ్య ఎర్రవల్లి ఫాంహౌస్​కు దగ్గరలో వేచి చూసి..చూసీ నిరాశతో వెనుదిరిగారు. దారులన్నీ మూసుకుపోవడంతో చేసేదేమీ లేక ఆదివారం ఎర్రవెల్లిలో కేసీఆర్​తో భేటీ అయ్యారు. అక్కడ అనుకున్న స్థాయిలో ఆయనకు రిసీవింగ్ లేకపోవడంతో డల్​గా కనిపించారు. ఇదిలా ఉంటే పోయినోళ్లను కాళ్లు మొక్కినా పార్టీలోకి తిరిగి తీసుకునేదే లేదన్న కేటీఆర్​ ఇప్పుడు ఏమంటారనే చర్చ మొదలైంది.